
అమలాపురం పీఎస్ వద్ద ముద్రగడ బైఠాయింపు
కాపు ఉద్యమ ఘటనలో సీఐడీ అరెస్ట్లకు దిగింది. తుని ఘటనకు సంబంధించి అమలాపురం, తునిలో అరెస్టు పది మందిని అరెస్టు చేశారు
అమలాపురం: అమలాపురం: కాపు ఉద్యమ ఘటనలో సీఐడీ అరెస్ట్లకు దిగింది. తుని ఘటనకు సంబంధించి అమలాపురం, తునిలో అరెస్టు పది మందిని అరెస్టు చేశారు. వారిని కొద్దిసేపట్లో కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. ఈ అరెస్ట్లను నిరసిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మంగళవారం అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కేసుల పేరుతో అమాయకుల్ని అరెస్ట్లు చేస్తే సహించేది లేదని, కావాలంటే తనను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసినవారిని విడుదల చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు.
ఇదే విషయంపై డీఎస్పీతో ఆయన వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ చేసినవారిని ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను అరెస్ట్ చేసి కోర్టుకు పంపాలని అన్నారు. కాపు ఉద్యమానికి కర్త, కర్మ అన్ని తాననేని అన్నారు. కార్యకర్తలను కాదని, ముందుగా నాయకుల్ని అరెస్ట్ చేయాలని ముద్రగడ సూచించారు. తమను అరెస్ట్ చేసేవరకూ అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు.
అయితే ఈ కేసు తమ పరిధిలో లేదని, రైల్వే పరిధిలో ఉందని డీఎస్పీ తెలిపారు. కాగా కేసు మీ పరిధిలో లేనప్పుడు అరెస్ట్లు ఎలా చేశారని ముద్రగడ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరోవైపు అమలాపురంలో 14చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ నేతృత్వంలో కోనసీమలో పోలీసులు మోహరించారు.