డాన్‌ నోరు విప్పాడు.. | Matka Beater Reveal the Secrets | Sakshi
Sakshi News home page

డాన్‌ నోరు విప్పాడు..

Oct 16 2016 10:48 PM | Updated on Oct 16 2018 2:30 PM

ఊహించినట్టుగా మట్కా డాన్‌ నోరు విప్పాడు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు మట్కా నిర్వాహకులతో పాటు వారికి సహాయం చేసిన పోలీసుల పేర్లను కూడా అతను వెళ్లడించినట్లు సమాచారం. దీంతో ఇటు మట్కా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు సంబంధాలున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దర్యాప్తు ముమ్మరం చేసే ప్రక్రియ వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

– పోలీసుల చేతిలో మట్కా బీటర్లు, పోలీసుల చిట్టా
– డీఐజీ కార్యాలయానికి చేరిన అధికారులు, సిబ్బంది జాబితా
– రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం

ప్రొద్దుటూరు క్రైం: ఊహించినట్టుగా మట్కా డాన్‌ నోరు విప్పాడు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు మట్కా నిర్వాహకులతో పాటు వారికి సహాయం చేసిన పోలీసుల పేర్లను కూడా అతను వెళ్లడించినట్లు సమాచారం. దీంతో ఇటు మట్కా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు సంబంధాలున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దర్యాప్తు ముమ్మరం చేసే ప్రక్రియ వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
 ఇటీవల తిరుపతిలో అదుపులోకి తీసుకున్న రాయలసీమ మట్కా డాన్‌ను జిల్లా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారించినట్లు తెలిసింది. ఇంత కాలంగా తనకు సహకరించిన పోలీసుల పేర్లను చెప్పాడని, ఆ జాబితా చేంతాడంత ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వీరిలో ప్రొద్దుటూరులో గతంలో పని చేసి వెళ్లిన పోలీసు అధికారులు, సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
నాలుగు జిల్లాల మట్కా నిర్వాహకుల పేర్లు వెల్లడి
 డాన్‌ తన మట్కా సామ్రాజ్యాన్ని రాయలసీమ వ్యాప్తంగా విస్తరించాడు. అతను జిల్లాల వారీగా పేరు పొందిన మట్కా కంపెనీ నిర్వాహకుల పేర్లను పోలీసులకు వెళ్లడించినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసు అధికారులు ఆయా జిల్లా పోలీసు అధికారులకు మట్కా నిర్వాహకుల జాబితాను పంపించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎర్రగుంట్లకు చెందిన మట్కా బీటర్లను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ప్రొద్దుటూరుకు చెందిన మట్కా డాన్‌ నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరి పేర్లను చెప్పారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా కడప పోలీసులు ఏక కాలంలో తిరుపతి, ప్రొద్దుటూరులో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇపుడు వీళ్లిచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైనట్లు కనిపిస్తోంది. శనివారం జిల్లా అధికారులు ప్రొద్దుటూరు పోలీసు అధికారులను కడపకు పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. డ్రైవర్‌ గోపాల్‌ అరెస్ట్‌ వ్యవహారంలో చేతులు మారిన నగదు గురించి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అంతేగాక మట్కా రాస్తున్న వారి జాబితాను ప్రొద్దుటూరు పోలీసు అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. ఈ లిస్టు ఆధారంగా ఇప్పటికే చాలా మంది మట్కా నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
వేగంగా దర్యాప్తు...
 ప్రొద్దుటూరు మట్కా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దర్యాప్తు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి జాబితాను డీజీపీ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎస్‌ఐలతో పాటు ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు, ఒక ఏఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నట్లు సమాచారం. వీరిలో కార్యాలయాల్లో పని చేస్తున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోపణలు మోస్తున్న వారిని బదిలీలతో సరిపెడతారో లేక సస్పెండ్‌ చేస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement