హనుమాన్ జంక్షన్‌లో భారీ చోరీ | Hanuman Junction in heavy Theft | Sakshi
Sakshi News home page

హనుమాన్ జంక్షన్‌లో భారీ చోరీ

Jul 1 2016 3:35 AM | Updated on Sep 4 2017 3:49 AM

తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు చాకచాక్యంగా చొరబడి రూ. 16 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన...

* రూ. 16 లక్షల సొత్తు అపహరణ
* హనుమాన్‌జంక్షన్ రూరల్

తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు చాకచాక్యంగా చొరబడి రూ. 16 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన సంఘటన గురువారం హనుమాన్ జంక్షన్‌లో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. స్థానిక గుడివాడ రోడ్డులో నివాసం ఉంటున్న కామినేని ఉషా వసుంధరాదేవి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులూ  విదేశాల్లో స్ధిరపడటంతో ఇక్కడ నివసిస్తోంది.

గురువారం ఉదయం బంధువుల ఇంట్లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి వసుంధరాదేవి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన మహిళ ఇంట్లో సామన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. కిటీకీలు ధ్వంసమై, బీరువాలు పగులగొట్టినట్లు గుర్తించి తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లి చూసి ఇంట్లో భద్రపర్చిన 40 కాసుల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.

ఎస్.ఐ బి.తులసీధర్, ఏఎస్‌ఐలు బాలాజీ, వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో వచ్చి సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులు చోరీకి  ఉపయోగించిన పలుగులు ఇంట్లోనే వదిలిపెట్టి ఉడాయించటంతో వాటిపై వేలిముద్రలు ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
 
పక్కా ప్రణాళికతో చోరీ...
ఇంటి ప్రధాన ద్వారానికి ప్రక్కనే ఉన్న కిటికీ తలుపులను తొలగించి దుండగులు లోపలికి వెళ్లినట్లు ఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తోంది. తొలగించిన కిటికీ ఇనుప చువ్వను బయట ఉంచితే .. ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉందని భావించిన దుండగులు దాన్ని ఇంటి పక్కన సందులో భద్రపరిచారు. పోలీసులు కేసును ఛేదించాల్సిఉంది.

Advertisement
 
Advertisement
Advertisement