ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన

Published Sun, Jul 31 2016 11:16 PM

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన

బోధన్‌: సుదీర్ఘ ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితంగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, గత ప్రభుత్వాల అడుగుజాడల్లో పాలన సాగిస్తోందని వామపక్ష, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. నిజాం షుగర్స్‌ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో ‘టీఆర్‌ఎస్‌ రెండేళ్ల పాలన–నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలి’ అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొంటామని స్వయంగా చెప్పిన సీఎం కేసీఆర్‌.. రెండేళ్లు గడిచినా హామీని నెరవేర్చలేదని రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు విమర్శించారు. పైగా లేఆఫ్‌ ప్రకటించి మూసివేశారని, వందలాది కార్మికులు రోడ్డున పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఆచరణలో అమలు కావడం లేదని తెలిపారు. తెలంగాణలో తమ బతుకులు బాగు పడతాయనుకున్న ప్రజలు ప్రభుత్వ విధానాలను చూసి నిరాశకు గురవుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వామపక్ష, ప్రజా సంఘాల నేతలు గంగాధర్‌ అప్ప, వరదయ్య, సాయిబాబా, షేక్‌బాబు, గంగారెడ్డి, సురేశ్, శ్రీనివాస్, శంకర్‌గౌడ్, భాస్కర్, జైత్రాం, సుల్తాన్‌ సాయిలు, శివకుమార్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement