పెన్షనర్లకు ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు పొడిచింది. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ చెల్లించాలంటూ పదో పీఆర్సీ
పాత రేట్ల ప్రకారమే పదవీ విరమణ ప్రయోజనాలు : ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు పొడిచింది. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ చెల్లించాలంటూ పదో పీఆర్సీ చేసిన సిఫారసును అమలు చేయకుండా ఇప్పటికే ఒకసారి దగా చేసింది. పదో పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత పదవీ విరమణ చేసిన వారికి పాత రేట్ల ప్రకారమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గణించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 2013 జూలై 1 తర్వాత పదవీ విమరణ చేసిన వారికి నష్టం కలగనుంది. పీఆర్సీ అమల్లోకి వచ్చిన తేదీ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి పీఆర్సీ సిఫార్సుల మేరకు తాజా రేట్ల ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్కగట్టాలి.
గత 9 పీఆర్సీల్లో ఇదే విధానాన్ని అనుసరించారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. 2013 జూలై 1 నుంచి పదో పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. 2014 జూలై 2 వరకు నగదు ప్రయోజనం లేకుండా(నోషనల్గా) పీఆర్సీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. గ్రాట్యుటీ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. మూల వేతనంలో పెరుగుదల ఉంటుంది కాబట్టి కమ్యూటేషన్ మొత్తం కూడా పెరుగుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా.. పాత రేట్ల ప్రకారమే పదవీ విరమణ ప్రయోజనాలను గణిస్తే నష్టపోతామనే ఆందోళన పెన్షనర్లలో నెలకొంది. కొత్త రేట్ల ప్రకారమే పదవీ విరమణ ప్రయోజనాలను గణించాలని యూటీఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.