పీటల మీద ఆగిన పెళ్లి 

Young Women Complaints To Police Regarding Marriage - Sakshi

ప్రేమ పేరుతో మోసం చేశాడని వరుడిపై యువతి ఫిర్యాదు

పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు 

సాక్షి, రామగిరి (మంథని): ప్రేమ పేరుతో మోసం చేశాడని వరుడిపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పీటల మీద పెళ్లి ఆగింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో శనివారం జరిగింది. ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం.. 

సెంటినరీకాలనీకి చెందిన నాగెల్లి సాంబయ్య, స్వరూపరాణి దంపతుల ప్రథమ కుమారుడు వరుణ్‌కుమార్‌కు నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు సెంటినరీకాలనీలో శనివారం ఉదయం 9.58 గంటలకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

అయితే వరుణ్‌కుమార్‌ తాను మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో వరుణ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతో వధూవరులకు సంబంధించిన బంధువులు వెళ్లిపోయారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top