పెళ్లి చేసుకోకుంటే చంపేస్తా..

Young Lady Was Molested At Jangaon - Sakshi

యువతికి వేధింపులు

తప్పించుకుని డీసీపీని ఆశ్రయించిన బాధితురాలు

జనగామ: ఇద్దరు యువతులపై అత్యాచారం, హత్య ఘటనల నుంచి ఇంకా తేరుకోక ముందే.. జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతిని యువకుడు వేధించిన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బస్సులో యువతిని వెంబడిస్తూ పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా 20 నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ఓ యువతి(19) హైదరాబాద్‌ మెహదీపట్నంలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు సంపత్‌ ఆమెతో కలిసి చదువుకోవడంతో పరిచయం ఉంది. ఆమె స్వగ్రామానికి వచ్చేందుకు శుక్రవారం సికింద్రాబాద్‌లో బస్సు ఎక్కుతున్న క్రమంలో సంపత్‌ పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు.

తాను కూడా బస్కెక్కి జనగామ వరకు వెంబడించి, బస్టాండ్‌లో దిగాక ఆమె ఫోన్‌ లాక్కుని పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ బెదిరించాడు. దీంతో కేకలు వేస్తూ బాధితురాలు సంపత్‌ నుంచి తప్పించుకుని నేరుగా డీసీపీ కార్యాలయానికి చేరుకుంది. ఆమె వాంగ్మూలం తీసుకున్న సీఐ మల్లేశ్‌.. 20 నిమిషాల్లోనే సంపత్‌ను పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువతిని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో ఎటువంటి ఆపద వచ్చినా వెంటనే 100 డయల్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top