అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం
ఘజియాబాద్ : క్షణికావేశం నిండు సంసారంలో నిప్పులు పోసింది. భర్తతో జరిగిన స్వల్ప వివాదం నేపథ్యంలో తన ఇద్దరు చిన్నారులతోపాటు ఆత్మహత్యకు పాల్పడిందో గృహిణి. ఈ ఘటనలో అయిదేళ్ల కుమారుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బైటపడగా, తల్లీ కూతుళ్లిద్దరూ సజీవహదనమైపోయారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్లోని మురాద్ నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది.
దీప (35) కైలాస్ దంపతులకు వీరికి పాప రీనా (2), బాబు లలిత్ (5) ఉన్నారు. అవసరం ఏమిటో తెలియదుగానీ, తనకు 2 వేల రూపాయలు ఇవ్వాలని భర్త కైలాస్ని అడిగింది. ఇందుకు కైలాస్ నిరాకరించడంతో వివాదం మొదలైంది. ఇది మరింత ముదిరి దీపమీ చేయి చేసుకొని బయటకు వెళ్లిపోయాడు కైలాస్. అంతే తలుపు గడియవేసుకొని తనతో పాటు, బిడ్డలిద్దరిపైనా కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. దీప, రీనా అగ్నికి ఆహూతి కాగా, ఎలాగోలా తలుపు గడియ తీసుకుని బైటపడిన లలిత్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అదనపు కట్నం కోసం తమ కూతురిని అత్తమామలు వేధిస్తూ వచ్చారని ఆరోపిస్తూ దీప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నీరజ్ కుమార్ జదౌన్ తెలిపారు.