ప్రియుడి మోజులో..

Wife Killed Husband With Boy Friend In Kurnool - Sakshi

భర్తను హత్య చేయించిన భార్య!

మృతుడి కుటుంబ  సభ్యుల ఆరోపణ  

మృతదేహంతో రాస్తారోకో

గోనెగండ్ల: ప్రియుడి మోజులో పడి కట్టుకున్నోడినే ఓ వివాహిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేయించినట్లు హతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈమేరకు నిందితులను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం మృతదేహంతో మండల కేంద్రంలోని కర్నూలు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వారి కథనం మేరకు.. గోనెగండ్లకు చెందిన భీమన్న కుమార్తె ముండాసి రామేశ్వరికి ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన చంటి(35)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొద్ది కాలంగా అదే గ్రామానికి చెందిన వీరేష్‌ అనే వ్యక్తితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త గుర్తించారు. దీంతో భర్త, అతడి కుటుంబసభ్యులు ఆమెను  పుట్టింటికి పంపారు.

విడాకులు ఇచ్చి తన కుమారుడిని తమకు అప్పగించాలంటూ భర్త తరచూ గోనెగండ్లకు వెళ్లి గొడవపడేవాడు. ఇందులో భాగంగా మంగళవారం అత్తారింటికి వెళ్లి రాత్రి అక్కడే నిద్రించాడు. చంటి గుండెనొప్పితో బాధపడుతున్నాడని, స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు భార్య, అతడి కుటుంబ సభ్యులు మృతుడి సోదరి భర్త రవికి చెప్పారు. తర్వాత కొద్దిసేపటికే మృతి చెందినట్లు సమాచారం ఇచ్చారు. అనంతరం చంటి మృతదేహంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు  కర్నూలు ప్రధాన రహదారిపై  రాస్తారోకో చేశారు. భార్య, ఆమె సోదరులు మునిస్వామి, రంగన్నలే చంటిని హతమార్చారని, వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చివరకు కోడుమూరు సీఐ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

పోలీసుల అదుపులో నిందితులు
మృతుడి సోదరుడు భాస్కర్‌  ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత  తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top