యాంకర్ తేజస్విని ఆత్మహత్య.. | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

Published Mon, Jun 18 2018 12:09 PM

TV Anchor Tejasvi Commits Suicide In Krishna - Sakshi

కంకిపాడు (పెనమలూరు) : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌ కాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మట్టపల్లి పవన్‌కుమార్, తేజస్విని (25) ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిపించారు. వీరికి ఒక పాప. కొద్ది కాలంగా ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. పవన్‌ కుమార్‌ ఉయ్యూరులోని బజాజ్‌ రిలయన్స్‌లో పని చేస్తున్నాడు. తేజస్విని విజయవాడలోని ఓ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పని చేశారు. ఇటీవల పవన్‌కుమార్‌ షిర్డీ వెళ్లాడు. శనివారం సాయంత్రం తేజస్వినికి, అత్త అన్నపూర్ణాదేవికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న తేజస్విని సాయంత్రం అయినా  తీయలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి కిటికీలో నుంచి చూడగా గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించారు. తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లిన పోలీసులు తేజస్విని మృతి చెందినట్లు నిర్ధారించుకుని వివరాలు సేకరించారు. తేజస్విని స్నేహితురాలి ద్వారా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అర్థరాత్రి సమయంలో వారు ఈడుపుగల్లు చేరుకున్నారు. వారి సమక్షంలో తేజస్విని మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ కె. శివాజీ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. 174వ సెక్షన్‌ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement