నూతన గృహంలో విషాదం | Tragedy in the new home | Sakshi
Sakshi News home page

నూతన గృహంలో విషాదం

Feb 27 2018 9:59 AM | Updated on Sep 28 2018 3:39 PM

Tragedy in the new home - Sakshi

మృతుడు సత్యనారాయణ

కృత్తివెన్ను: మరికొన్ని గంటల్లో గృహప్రవేశం..బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లంతా సందడిగా ఉంది. పాపం ఆ యజమానికి తెలియదు మృత్యువు విద్యుత్‌ రూపంలో పొంచి ఉందని. ఇంటిలోకి సరఫరా రావడం లేదని చేసిన చిన్న ప్రయత్నం యజమాని ప్రాణాలను కాటేసింది. ఈ సంఘటన కృత్తివెన్నులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే కృత్తివెన్నుకు చెందిన శిరిగినేడి సత్యనారాయణ (40)నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటలకు గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారు.

దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలో ఇంటిలోకి కరెంటు సరఫరాలో కలిగిన లోపాన్ని సరిచేసే ప్రయత్నంలో సత్యనారాయణ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. బంధువులు హుటాహుటిన వైద్యుని వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. మరికొన్ని గంటల్లో నూతన గృహప్రవేశం చేయాల్సిన యజమాని విగతజీవిగా మారడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

మృతుడు జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవలే ఇంటి నిర్మాణం కోసం కృత్తివెన్నుకు వచ్చినట్లు సమాచారం. దీనిపై బంధువుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్‌ఐ తులసీ రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement