ceromany
-
నూతన గృహంలో విషాదం
కృత్తివెన్ను: మరికొన్ని గంటల్లో గృహప్రవేశం..బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లంతా సందడిగా ఉంది. పాపం ఆ యజమానికి తెలియదు మృత్యువు విద్యుత్ రూపంలో పొంచి ఉందని. ఇంటిలోకి సరఫరా రావడం లేదని చేసిన చిన్న ప్రయత్నం యజమాని ప్రాణాలను కాటేసింది. ఈ సంఘటన కృత్తివెన్నులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే కృత్తివెన్నుకు చెందిన శిరిగినేడి సత్యనారాయణ (40)నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటలకు గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలో ఇంటిలోకి కరెంటు సరఫరాలో కలిగిన లోపాన్ని సరిచేసే ప్రయత్నంలో సత్యనారాయణ విద్యుత్ షాక్కు గురయ్యాడు. బంధువులు హుటాహుటిన వైద్యుని వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. మరికొన్ని గంటల్లో నూతన గృహప్రవేశం చేయాల్సిన యజమాని విగతజీవిగా మారడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడు జీవనోపాధి కోసం హైదరాబాద్లో ఉంటూ ఇటీవలే ఇంటి నిర్మాణం కోసం కృత్తివెన్నుకు వచ్చినట్లు సమాచారం. దీనిపై బంధువుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తులసీ రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నామన్నారు. -
ఘనంగా సీఆర్పీఎఫ్ జవాను అంత్యక్రియలు
ధర్మవరం అర్బన్ : ధర్మవరం పట్టణానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను జార్ఖండ్లో మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ మధుసూదన్రెడ్డి, చౌడప్ప, లోనికోట అమర్, నరేంద్రరెడ్డిలు జవాను గురుప్రసాద్ భౌతికకాయం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జవాను ఇంటి వద్ద నుంచి పుష్ప వాహనంపై పార్థివదేహాన్ని ఉంచి వందలాది మంది జనసందోహం నడుమ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గురుప్రసాద్ తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు గురుప్రసాద్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడని ఉన్నతస్థాయి అధికారులు విచారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కన్నీటి వీడ్కోలు మధ్య జవాను అంత్యక్రియలు ముగిశాయి.