విషాదం... 10 మంది కూలీలు మృతి
సాక్షి, నారాయణపేట : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టిదిబ్బలు కూలడంతో 10 మంది ఉపాధిహామీ కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన మరికల్ మండలం తీలేరు శివాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మట్టిదిబ్బలు తొలిగిస్తేనే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది. గ్రామానికి చెందిన 30 మంది ఉపాధిహామీ కూలీలు రెండు గ్రూప్లుగా గ్రామ శివారులో జరుగుతున్న ల్యాండ్ డెవెలప్మెంట్ పనులు చేస్తున్నారు.
ఇందులో 15 మంది లోయలాగా ఉన్న గుంతలో దిగి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వారిపై మట్టిదిబ్బలు పడ్డాయి. దీంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రొక్లెన్ సాయంతో మట్టిదిబ్బలు తీయిస్తున్నారు. పొట్టకూటి కోసం కూలికెళ్లిన తమవారు విగత జీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది.