ప్రజావాణిలో గీత కార్మికుడి ఆత్మహత్య | Toddy tapper suicide in Prajavani | Sakshi
Sakshi News home page

Jan 23 2018 2:17 AM | Updated on Nov 6 2018 7:53 PM

Toddy tapper suicide in Prajavani - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల / మంచిర్యాల సిటీ: కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఓ గీత కార్మికుడు సరైన స్పందన రాకపోవ డంతో పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల కలెక్టరేట్‌ ఆవరణలో సోమవారం జరిగింది. మంచిర్యాల జిల్లా నెన్నెలకు చెందిన గీత కార్మికుడు రంగు రామా గౌడ్‌ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఇబ్రïహీం, ఆయన భార్య గ్రామ సర్పంచ్‌ అస్మా ఇబ్రహీం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని రామాగౌడ్‌ టీడీ పీ మండలాధ్యక్షుడి హోదాలో పత్రికా ప్రకటనలు ఇచ్చాడు. సర్పంచ్‌ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

రామా గౌడ్‌పై కక్ష పెంచుకున్న ఇబ్రహీం ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టించాలని భావించి తన వద్ద పనిచేసే పల్లె మహేశ్‌ ద్వారా డిసెంబర్‌ 13న నెన్నెల పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించాడు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఈనెల 2న జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌కు ఫిర్యాదు చేశాడు. అయినా, స్పందన లేకపోవడంతో సోమ వారం ప్రజావాణిలో జేసీ సురేందర్‌రావు వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరాడు. నెన్నెల తహసీల్దార్‌ను విచారణకు ఆదేశించామని జేసీ  చెప్పారు. దీంతో తనకు న్యాయం జరగదని మనస్తాపానికి గురై తెచ్చుకున్న పురుగుల మందును అక్కడే తాగి పడిపోయాడు. పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement