పసికందుతో సౌజన్యారెడ్డి కుటుంబీకుల రాస్తారోకో

Sowjanya Reddy Suicide Case Karimnagar - Sakshi

బోయినపల్లి(చొప్పదండి): కట్నం వేధింపులతో సౌజన్యారెడ్డి ఆత్మహత్య చేసుకోగా.. తన రెండునెలల పసికందుతో ఆమె బంధువులు మండలంలోని మల్లాపూర్‌లో బీటీ రోడ్డుపై ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. వేములవాడరూరల్‌ సీఐ డి.రఘుచందర్‌ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విరమించారు. అనంతరం శవంతో యథావిధిగా ఆమె భర్త ఇంటి ఎదుట బైఠాయించారు. వర్షం కురుస్తున్నా న్యాయంకోసం రెండునెలల పసికందుతో రోడ్డుపై రాస్తారోకో చేయడం చూపరులకు కన్నీరు తెప్పించింది.

వివరాల్లోకి వెళ్తే రాజేందర్‌రెడ్డి వేధింపులతో గతనెల 24న ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకున్న సౌజన్యారెడ్డి చికిత్స పొందుతూ ఈనెల 6న మృతి చెందిన విషయం తెలిసిందే. రెండునెలల బాబుకు న్యాయం చేయాలని ఆమె బంధువులు రాజేందర్‌రెడ్డి ఇంటి ఎదుట రెండురోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఒక సందర్భంలో సౌజన్యారెడ్డి శవాన్ని భర్త ఇంటివద్ద ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది.

పోలీసుల బందోబస్తు
సౌజన్యారెడ్డి శవంతో ఆమె బంధువులు రెండురోజులుగా మల్లాపూర్‌లో ఆందోళన చేస్తుండడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.  సీఐ, ఎస్సై ఎన్‌.వెంకటక్రిష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top