శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident In Shamirpet, Three killed | Sakshi
Sakshi News home page

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Aug 12 2019 6:05 PM | Updated on Aug 12 2019 8:14 PM

Road Accident In Shamirpet, Three killed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శామీర్‌పేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అవతలవైపు వెళుతున్న కారుపైకి దూసుకువెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మృతులు హైదరాబాద్‌ నాగోల్‌కు చెందిన కోసూరి కిషోర్‌ చారి, ఆయన భార్య భారతి, పెద్ద కుమారుడు సుధాన్ష్‌ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో కుమారుడు తనీష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో చనిపోయిన కిషోర్ చారి నాగోల్ డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చ అధ్యక్షుడి గా చేస్తున్నాడు. కిషోరి చారి ఆయన భార్య ఇద్దరు కుమారులతో కలిసి కరీంనగర్‌లోని ఓ పుణ్య క్షేత్రానికి వెళ్లి ఈకో స్పోర్ట్స్ కారులో తిరిగి హైదరాబాద్ వస్తుండగా శామీర్‌పేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

కిషోర్‌ చారి అతి వేగంగా కారు నడపడంతో  అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టి ఎదురు రోడ్డులో వస్తున్న ఎర్టిగా కారు మీద ఎగిరి పడింది. ప్రమాదంలో ఈకో స్పోర్ట్స్ కారులో ప్రయాణిస్తున్న కిషోర్ చారి కుటుంబంలో ముగ్గురు మరణించారు. మరో కుమారుడు తనీష్ ప్రాణాపాయ స్థితిలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో ఎర్టిగా కారులో ఉన్న రాజు, మహేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అతివేగంతో పాటు ముందు వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇక​ ప్రమాద తీవ్రతతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్రేన్‌ సాయంతో ప్రమాదానికి గురైన కారును అక్కడ నుంచి తరలించి, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement