ప్రేమ వివాహానికి బంధువుల అడ్డగింత

relatives trying to stop lovers marriage

చాటుగా ఆలయంలో పెళ్లి

ప్రేమజంటను వెంబడించిన బంధువులు

స్టేషన్‌కు చేరిన ప్రేమ వ్యవహారం

కురవి(డోర్నకల్‌): ప్రేమ వివాహానికి బంధువులు అడ్డు తగిలారు.. అయినా బంధువుల కళ్లు గప్పిన ప్రేమికులు ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వారిని బంధువులు వెంబడిస్తుండగా వారిరువురు శుక్రవారం సాయంత్రం కురవిలోని కానుగంటి లక్ష్మీభాయి ఇంట్లోకి వెళ్లి తల దాచుకున్నారు. వివరాల్లోకెళితే.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడకు చెందిన మామిడివిజయ్‌ అదే గ్రామానికి చెందిన బూర శిరీషలు గత సంవత్సరన్న కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్‌లే. శుక్రవారం వారు ద్విచక్రవాహనంపై కురవికి చేరుకున్నారు. ఇక్కడి ప్రేమ పెళ్లిళ్లు చేయరని తెలుసుకుని మహబూబాబాద్‌ మండలంలోని అనంతారం ఆలయానికి వెళ్లారు.

అక్కడ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంట్లో నుంచి శిరీష వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న ఆమె బావ అతడి స్నేహితులతో కలసి కారులో అనంతారం వెళ్లారు. విజయ్, శిరీష జంటను వెంబడించారు. వారినుంచి తప్పించుకున్న ప్రేమికులు ద్విచక్రవాహనంపై కురవికి చేరుకుని లక్ష్మీభాయి ఇంట్లోకి వెళ్లి తల దాచుకున్నారు. బంధువులు వారు దాచుకున్న ఇంటిమీదకు వచ్చి గొడవకు దిగగా కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందచేశారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై అశోక్‌ను వివరణ కోరగా సర్టిఫికెట్లు పరిశీలించి మేజర్లు అయితే ఇంటికి పంపిస్తామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top