అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు | Sakshi
Sakshi News home page

అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

Published Sun, Aug 11 2019 7:21 AM

Old Men Was Brutually Murdered By His Son In Rebbena, Adilabad - Sakshi

సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్‌) : సూటి పోటి మాటలతో తండ్రి పెట్టే వేధింపులు తాళలేక కన్న కొడుకే తండ్రిని గొడ్డలితో హతమార్చిన సంఘటన శనివారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలంలోని కిష్టాపూర్‌లో చోటు చేసుకుంది. సొంత కోడలిపై అనుమానంతో కొడుకును కోడలిని మాటలతో వేధింపులకు గురి చేయటంతో తండ్రి ప్రవర్తనపై విసుగు చెందిన కుమారుడు తండ్రిని నరికి చంపాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన చునార్కర్‌ రాజయ్య(72) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు లింగయ్య, గణపతిలతో పాటు ఒక కూతురు ఉంది. రాజయ్య భార్య నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందగా పెద్ద కుమారుడు లింగయ్య వద్ద ఉంటున్నాడు. అయితే గత నాలుగు నెలల నుండి పెద్ద కోడలు లక్ష్మిపై అనుమానం పెంచుకున్న రాజయ్య తరుచుగా సూటిపోటి మాటలతో కొడుకు లింగయ్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. నీ భార్య ప్రవర్తన సరిగా లేదని ఆమెను ఇంట్లో నుండి వెళ్లగొట్టమని వేధింపులకు గురిచేసేవాడు. రోజుల తరబడి ఇదే తతంగం జరుగుతుండటంతో తం డ్రీకొడుకుల మధ్య తగాదాలు ఏర్పడ్డాయి.  

శనివారం ఉదయం సైతం మరోసారి కోడలి ప్రవర్తన సరిగా లేదంటూ కొడుకు లింగయ్యను దుర్భాషలాడటంతో తండ్రి పెట్టే మానసిక వేధింపులు తాళలేక లింగయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో రాజయ్య తలపై బలంగా మోదాడు. వెంటనే విషయాన్ని రాజయ్య చిన్నకోడలు శాంతాబాయి గ్రామానికి సమీపంలో ఉన్న చేనులో పనుల కోసం వెళ్లిన తన భర్త గణపతికి తెలపటంతో హుటాహుటిన చిన్న కుమారుడు ఇంటికి చేరుకునే సరికి రాజయ్య అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో రెబ్బెన సీఐ ఆకుల ఆశోక్, ఎస్సై దీకొండ రమేష్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిణామాలపై విచారణ చేపట్టారు. మృతుడి చిన్న కుమారుడు గణపతి అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
Advertisement