మటన్‌ కత్తితో పిల్లల గొంతు కోసి హత్య 

Mother Murder Two Child In Jangaon District - Sakshi

ఆపై ఆత్మహత్యాయత్నం 

జనగామ జిల్లాలో దారుణం 

సాక్షి, నర్మెట: కన్నపేగే బిడ్డలపై పాశవికం చూపింది. అతి దారుణంగా మటన్‌ కోసే కత్తితో గొంతులు కోసి నిద్రించిన మంచంపైనే హత్య చేసింది. ఆపై అదే కత్తితో తానూ గొంతు కోసుకుని ఆత్మహత్నాయత్నానికి పాల్పడింది. ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేట శివారు శివబీక్యా తండాలో సోమవారం జరిగింది. అనారోగ్యంతో తల్లిగారింటికి మల్కపేట శివారు శివబీక్యా తండాకు చెందిన గోపాల్‌తో రమకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కుమార్తె భానుశ్రీ (4), కుమారుడు వరుణ్‌ (2.5 ఏళ్లు) ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రమ తల్లి గారిల్లయిన మల్కపేటకు వెళ్లింది. రమ అనారోగ్యం వల్ల పిల్లలు తండ్రితోనే ఉంటున్నారు. ఇన్నాళ్లూ తల్లిగారింటి వద్దే ఉన్న రమ సోమవారం అత్తవారింటికి వచ్చింది. 
అత్తామామలు పనికి.. భర్త ఊరికి 
రమ వచ్చాక అత్తామామలు పొలం పనులకు పోగా, భర్త గోపాల్‌ పని మీద వేరే ఊరికి వెళ్లాడు. మధ్యాహ్నం రమ పిల్లలకు భోజనం చేయించి నిద్రపుచ్చింది. మటన్‌ కోసే కత్తితో నిద్రలో ఉన్న పిల్లలిద్దరీ గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం అదే కత్తితో తానూ గాయపరచుకుని మంచంపైనే పడిపోయింది. సాయంత్రం పొలం నుంచి వచ్చిన అత్తామామలు ఈ దృశ్యాలను చూసి నివ్వెరపోయారు. అప్పటికే పిల్లలిద్దరికీ తీవ్ర రక్తస్రావమై మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రమను వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. రమ గత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోందని, దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండటంతో పిల్లలను చంపి తనూ ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని జనగామ సీఐ మల్లేష్‌ యాదవ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top