దైవసన్నిధిలో వివాహిత ఆత్మహత్య

Married woman suicide in temple

నర్రవాడ(దుత్తలూరు): దైవసన్నిధిలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న  ఘటన శుక్రవారం నర్రవాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..కలిగిరి మండలం నాగసముద్రం బీసీ కాలనీకి చెందిన ఇర్ల రాజేశ్వరి(30), వెంకటేశ్వర్లు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో పనిచేస్తూ దసరాకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం పనికి వెళ్దామని భార్యను కోరగా, తనకు ఆరోగ్యం సరిగాలేదని తెలిపింది. భర్త పనికి వెళ్లిన తరువాత కుమార్తె, కుమారుడ్ని తీసుకుని వింజమూరు బయల్దేరింది. వింజమూరులో పిల్లలకు టిఫిన్‌ పెట్టించి పురుగుల మందు కొనుగోలు చేసింది. అక్కడ్నుంచి వెంగమాంబ దర్శనం చేసుకుందామని నర్రవాడకు తీసుకొచ్చింది. వెంగమాంబ దర్శనం అనంతరం క్యూలైన్ల సమీపంలోని మెట్ల వద్ద పిల్లలతో కూర్చుంది.

పిల్లలు ఆకలేస్తుందమ్మా ఇంటికి వెళ్దామనగా, కాలకృత్యాలు తీర్చుకురండి వెళ్దామని చెప్పింది. పిల్లలు పక్కనే ఉన్న చెట్ల చాటుకు కాలకృత్యాలకు వెళ్లగా రాజేశ్వరి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించింది. తిరిగి వచ్చిన పిల్లలు తల్లి నోరు, ముక్కు వెంట నురుగు రావడం చూసి భయంతో చుట్టుపక్కల వారిని కేకలు వేశారు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఎం వెంకటరాజేష్‌  ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. తల్లి మృతదేహంవద్ద పిల్లలు కన్నీరుమున్నీరు కావడం పలువురిని కంట తడిపెట్టించింది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top