40 మంది మహిళా ప్రొఫెసర్లకు అసభ్యకర కాల్స్
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జైపూర్ : ఇంటర్నెట్ సహాయంతో 40 మంది మహిళా ప్రొఫెసర్లకు అసభ్యకర కాల్స్ చేస్తున్న ఓ టీనేజర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని హిస్సార్కు చెందిన నిందితుడు రాజస్తాన్ యూనివర్సిటీలో తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో యూనివర్సిటీ వైఫై పాస్వర్డ్ తెలుసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులకు చిక్కకుండా ఈ దారుణానికి వైఫై సహాయంతో ఇంటర్నెట్ కాల్స్ను ఉపయోగించాడు. పైగా యూనివర్సిటీ వెబ్సైట్ నుంచే మహిళా ప్రొఫెసర్ల మొబైల్ నెంబర్లు తీసుకొని అసభ్యకర పదజాలంతో వేధించాడు.
జూలై 3న ఓ మహిళా ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. నిందితుడు ఎలాంటి ఆధారం లేకుండా జాగ్రత్త పడటంతో ఇబ్బంది పడ్డారు. చివరకు ఫోన్కాల్స్ వస్తున్న ఐపీ అడ్రస్ ఆధారంగా కూపి లాగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.