ప్రాణం తీసిన మద్యం తగాదా | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మద్యం తగాదా

Published Sat, Sep 15 2018 7:14 AM

Friends Killed In Alcohol Conflict In West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్‌: ఇరువురు స్నేహితుల మధ్య తలెత్తిన మద్యం తగాదా ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో చేసిన తప్పిదం రెండు కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామానికి చెందిన అంగర వెంకన్న, దాసరి సత్యనారాయణ స్నేహితులు. వ్యవసాయ పనులు చేసుకుని కుటుంబాలను సాకుతున్నారు. బుధవారం రాత్రి సత్యనారాయణ మద్యం తీసుకురమ్మని రూ.500లు వెంకన్న చేతికిచ్చారు.

అతను మూడు క్వార్టర్‌ బాటిళ్లు తీసుకుని వచ్చి చెరొక క్వార్టరు తాగారు. వేరొక క్వార్టర్‌ బాటిల్‌ కోసం సత్యనారాయణ వెంకన్నను ఆరా తీశారు. దీంతో క్వార్టర్‌ బాటిల్‌ ముందే తాగేశానని చెప్పడంతో నా డబ్బుతో మద్యం తీసుకువచ్చి నాకు ఇవ్వకుండా తాగుతావా అంటూ సత్యనారాయణ వెంకన్నను గద్దించాడు. దీంతో ఇరువురు మధ్య మాటామాటా పెరిగి పోయింది. కోపంతో సత్యనారాయణ దగ్గరలో ఉన్న ఇనుపరాడ్‌ తీసుకుని వెంకన్న తలపై మోదడంతోఅక్కడికక్కడే మృతిచెందారు. వెంకన్న సోదరుడు అంగర సాయిమాణిక్యం ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ కోలా రజనీకుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై కె శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శుక్రవారం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడు వెంకన్నకు భార్య, కుమార్తె ఉన్నారు.

Advertisement
Advertisement