‘గులాబీ’ గుబులు..అప్పుల తిప్పలు

Farmers Suicide  In Adilabad - Sakshi

జైనథ్‌(ఆదిలాబాద్‌): పంట నష్టంతో మనస్తాపం చెందిన మండలంలోని పెండల్‌వాడ గ్రామానికి చెందిన రైతు బొల్లి రమేశ్‌ (40) పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుల్లయ్య కథనం ప్రకారం.. రమేశ్‌ తల్లి పేరిట 5 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం 9 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. సాగు కోసం రూ.లక్ష బ్యాంకు అప్పు, మరో లక్ష ప్రైవేటు అప్పు ఉంది. ప్రస్తుతం పంటలో అక్కడక్కడ గులాబీరంగు పురుగు కనిపించడంతో గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. పురుగు ఉధృతి పెరిగితే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాదనే దిగాలుతో శుక్రవారం రాత్రి ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలాపూర్‌ వరకు ఆటోలో తీసుకొని రాగా, అక్కడి నుంచి 108లో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య నామమ్మ, ఇద్దరు కుమారు ఉన్నారు. కాగా మృతుడి తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

భీమిని(బెల్లంపల్లి): భీమిని మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు చౌదరి దేవాజీ(45) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం..దేవాజీ కొన్నేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. గతేడాది పంట దిగుబడి సరిగా రాలేదు. ఈ ఏడాది కూడా నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. అలాగే కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు అన్ని కలుపుకొని సుమారు రూ.3 లక్షలు అప్పులయ్యాడు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. దేవాజీకి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top