అనుమానిస్తున్నాడని అడ్డంగా నరికేసింది

Delhi Woman Chops Husband Into 8 Pieces - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: క్రైమ్‌ షోలకు అలవాటు పడ్డ భార్య తనను అనుమానిస్తున్నాడని భర్తను కిరాతకంగా చంపేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ హత్య ఢిల్లీలో చోటు చేసుకుంది. రాజేశ్, సునీత భార్యాభర్తలు. వీరి మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు సునీతకు ఎవరితోనో సంబంధం ఉందంటూ అనుమానించడంతో అతనిపై మరింత కోపాన్ని పెంచుకుంది. ఎలాగైనా సరే ఈ గొడవలకు స్వస్తి చెప్పాలని భావించిన సునీత తన భర్తను చంపడానికే సిద్ధపడింది. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 14న రాజేశ్‌కు మత్తుమందు ఇచ్చి, తన కుమారుడిని పక్కింటికి పంపించింది.  రాజేశ్‌ శరీరాన్ని కసితీరా 8 భాగాలుగా నరికింది. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ముక్కలను వేర్వేరు బ్యాగుల్లో ప్యాక్‌ చేసింది. తలను డ్రైనేజీలో వేసింది. కాళ్లను ఇంటి ఆవరణలో, మిగతా భాగాలను తన బెడ్‌రూమ్‌తో పాటు, మిగతా ప్రాంతాల్లో పూడ్చిపెట్టింది.

తర్వాత 2 రోజులకు తన భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత సునీత ఇంటి దగ్గరలో డ్రైనేజీలో గుర్తుపట్టని స్థితిలో తల కన్పించింది. కానీ అది రాజేశ్‌ తలగా నిర్ధారణ చేసుకోలేకపోయారు పోలీసులు. కానీ గతవారం సునీత గదిలో పూడ్చిన నేలపై కుళ్లిపోయే స్థితిలో ఉన్న వేళ్లను ఇంటి యజమాని గమనించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో సునీతను విచారించగా హత్య చేసినట్టుగా అంగీకరించింది. ప్రేమికుల రోజు నాడే భర్తను పరలోకానికి పంపిన సునీత తీహార్‌ జైల్‌లో శిక్ష అనుభవిస్తుంది. తల్లికి, తండ్రికి దూరమైన బాలుడిని పిల్లల  ఆశ్రమంలో చేర్పించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top