పొలానికి వెళ్లిన చిన్నారిపై అఘాయిత్యం | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 23 2018 4:32 PM

9 Year Old Girl Abused And Murdered With Her Minor Brother In Muzffarpur - Sakshi

ముజఫర్‌పూర్‌/పట్నా: బిహార్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. పశువులను మేపడానికి వ్యవసాయం పొలం వద్దకు వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురయింది. ఘటనా ప్రాంతంలోనే ఉన్న ఆమె తమ్ముడిని (7)సైతం దుండగుడు ప్రాణాలతో విడిచిపెట్టలేదు. ఈ ఘోరం ముజఫర్‌పూర్‌ జిల్లాలోని పారు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వ్యవసాయ పొలం వద్ద రెండు కుంటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవ కొనసాగుతోంది.

ఆదివారం సాయంత్రం పశువులను మేపడానికి తమ్ముడిని తీసుకుని పొలం వద్దకు వెళ్లిన చిన్నారిపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. అడ్డుగా వచ్చిన ఆమె తమ్ముడిని, అనంతరం పాపను హత్యచేసి పక్కనే ఉన్న నది గట్టుపై పడేసి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. చిన్నారుల తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన ముగ్గురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, కేసు నమోదు చేశామనీ, పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ హర్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపారు.

గత కొంత కాలంగా బిహార్‌లో అత్యాచార ఘటనలు తీవ్రమవుతున్నాయి. 2018 మొదటి మూడు నెలల్లో మహిళలు, బాలికలపై 127 అత్యాచార ఘటనలు చోటుచేసుకోగా, జూన్‌ నెల ముగిసేసరికి ఆ సంఖ్య రెట్టింపు అయిందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement