ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకతను ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్ చందాకొచ్చర్ ఉద్ఘాటించారు.
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకతను ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్ చందాకొచ్చర్ ఉద్ఘాటించారు. తద్వారా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మరింత పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో 30 శాతం నుంచి 35 శాతం వరకూ ఉన్న మహిళా భాగస్వామ్యాన్ని దాదాపు 50 శాతానికి పెంచగలిగినా... అది దేశ వృద్ధి మరింత శాతం పెరగడానికి దోహదపడుతుందని అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) 5.5 శాతం జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని కూడా వివరించారు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(వైఎఫ్ఎల్ఓ) గురువారం నిర్వహించిన ‘ఉన్నత శిఖరాలపై మహిళ’ అనే ఒక చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బోర్డ్ సమావేశాల్లో పాల్గొనే మహిళలు- తనపై తనకు పూర్తి విశ్వాసంతో బాధ్యతలు నిర్వహించాలని అన్నారు. ఇందుకు విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ‘‘బాధ్యతలు నిర్వహించే చోట మహిళలు, పురుషులు అన్న తేడాలు ఉండకూడదు. అయితే మహిళా భద్రతా, రక్షణ వంటి విషయాల్లో మాత్రం తగిన పటిష్ట చర్యలు అవసరం’’ అని అన్నారు.
మహిళల భాగస్వామ్యం పెంపొందడం కేవలం వారికే ప్రయోజనం చేకూర్చదని, మొత్తం ప్రపంచం సామాజిక, ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడుతుందని విశ్లేషించారు. భారత్ మొత్తం జనాభాలో సగం మంది మహిళలున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆర్థిక వ్యవస్థలో వీరి భాగస్వామ్యం పెంపొందించడం ద్వారా పలు రంగాల్లో మంచి ఫలితాలు సాధించవచన్నారు. ఐసీఐసీఐని రిటైల్ రంగంలో ఒక దిగ్గజంగా నిలబెట్టడంలో కొచ్చర్ కృషి కొనియాడదగినదని వైఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ అవర్ణా జైన్ ఈ సందర్భంగా అన్నారు.
వృద్ధి సంకేతాలు బాగు..: కాగా దేశాభివృద్ధి రికవరీ బాటన పయనిస్తోందనడానికి పలు సంకేతాలు కనిపిస్తున్నాయని కొచ్చర్ అన్నారు. బొగ్గు రంగంలో పురోగతి కనిపిస్తోందన్నారు. కార్ల అమ్మకాలు మెరుగుపడుతున్న అంశాన్ని సైతం ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో 5.5% వృద్ధిరేటు సాధన సాధ్యమేనని అ న్నారు. ఆర్బీఐ పాలసీ రేటు కోత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో ఉండవచ్చని ఆమె అంచనావేశారు.