టెల్కోల గుట్టు రట్టు చేసిన కాగ్‌ | Sakshi
Sakshi News home page

టెల్కోల గుట్టు రట్టు చేసిన కాగ్‌

Published Fri, Jul 21 2017 5:13 PM

టెల్కోల గుట్టు రట్టు చేసిన కాగ్‌ - Sakshi

న్యూఢిల్లీ : భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్ల వంటి ప్రైవేట్‌ టెలికాం కంపెనీల గట్టును కాగ్‌ రట్టు చేసింది. 2010-11, 2014-15 మధ్య కాలంలో వీరు తక్కువ చేసి చూపించిన రెవెన్యూ విలువపై కాగ్‌ ఓ నివేదిక రూపొందించి పార్లమెంట్‌కి సమర్పించింది. ఈ రిపోర్టులో ఆరు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు తెలిపింది. దీంతో ప్రభుత్వానికి రూ.7,697.6 కోట్ల చెల్లింపులు తగ్గిపోయాయని కాగ్‌ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శుక్రవారంపార్లమెంట్‌లో సమర్పించింది.
 
కాగ్‌ తన ఆడిట్‌లో ఆరు ఆపరేటర్లు అడ్జెస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూలు మొత్తం రూ. 61,064.56 కోట్లకు తగ్గించి చూపించాయని పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఎయిర్‌సెల్‌ వంటి ఐదు ఆపరేటర్లకు సంబంధించిన 2010-11 నుంచి 2014-15 కాల ఆడిట్‌ రిపోర్టులో ఇవి బయటపడగా.. సిస్టెమా శ్యామ్ అనే కంపెనీ 2006-07 నుంచి 2014-15 ఈ చర్యకు పాల్పడిందని తెలిసింది. రెవెన్యూ షేరును తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం భారీ మొత్తంలోనే చెల్లింపులను పోగట్టుకుందని కాగ్‌ రిపోర్టు తేల్చింది.       
 

Advertisement
Advertisement