ఆరో అతిపెద్ద ఇంధన దిగ్గజం.. ఆర్ఐఎల్

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. మంగళవారం నాటి మార్కెట్ విలువ ఆధారంగా బీపీ పీఎల్సీని వెనక్కి నెట్టేసి ఈ రికార్డును నమోదు చేసింది. తద్వారా అగ్రగామి ఇంధన కంపెనీల క్లబ్లోకి అడుగుపెట్టింది. మంగళవారం బ్రిటిష్ కంపెనీ బీపీ మార్కెట్ విలువ 132 బిలియన్ డాలర్లు కాగా, రిలయన్స్ మార్కెట్ విలువ 133 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత నెలలోనూ ఓ సారి బీపీని మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ అధిగమించింది. అలాగే, ఆసియాలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ పెట్రోచైనా మార్కెట్ విలువకు చేరువగా ఆర్ఐఎల్ వచ్చేసింది. ఈ ఏడాది ఆర్ఐఎల్ షేరు 35% ర్యాలీ చేయగా, బీపీ షేరు 1.2% పెరిగింది. వచ్చే 18 నెలల కాలంలో కంపెనీని రుణరహితంగా మారుస్తామని ఈ ఏడాది ఆగస్ట్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి