స్టాక్స్‌ వ్యూ

Grasim Industries Target Rs 1057 - Sakshi

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ.756  టార్గెట్‌ ధర: రూ.1,057
ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌ ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం నాలుగు విభాగాల్లో–వీఎస్‌ఎఫ్, సిమెంట్, రసాయనాలు, టెక్స్‌టైల్స్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిల్లో వీఎస్‌ఎఫ్, సిమెంట్‌ కీలక విభాగాలు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం, నిర్వహణ లాభాల్లో ఈ రెండు విభాగాల వాటా దాదాపు 90 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వీఎస్‌ఎఫ్, కాస్టిక్‌ సోడా ధరలు అంతర్జాతీయంగా బలహీనంగా ఉండటంతో నిర్వహణ లాభం(స్టాండ్‌అలోన్‌) అంచనాల మేరకు పెరగలేదు.

వీఎస్‌ఎఫ్‌(విస్కోస్‌ స్టేపుల్‌ ఫైబర్‌–నూలు లాగానే ఉండే బయోడిగ్రేడబుల్‌ ఫైబర్‌. దుస్తులు, హోమ్‌ టెక్స్‌టైల్స్, డ్రెస్‌ మెటీరియల్, లో దుస్తుల తయారీలో దీనిని వినియోగిస్తారు) కు సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం వంద శాతాన్ని వినియోగించుకున్నా, అమ్మకాలు 3 శాతమే పెరిగాయి.  డిమాండ్‌ బలహీనంగా ఉండటం, దిగుమతులు పెరగడంతో కెమికల్స్‌ విభాగం పనితీరు అంచనాలను అందుకోలేకపోయింది. అమ్మకాలు 7 శాతం తగ్గగా, మార్జిన్లు 8 శాతం తగ్గి 20 శాతానికే పరిమితమైంది.

దేశంలోనే అతి పెద్ద సిమెంట్‌ కంపెనీ అయిన అ్రల్టాటెక్‌ సిమెంట్‌లో 57.3 శాతం వాటా ఉండటం, స్టాండ్‌అలోన్‌ వ్యాపారాలు నిలకడైన వృద్ధిని సాధిస్తుండటం, వీఎస్‌ఎఫ్‌ వ్యాపారంలో దాదాపు గుత్తాధిపత్యం ఉండటం, వీఎస్‌ఎఫ్, రసాయనాల విభాగాల ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతుండటం, ఏబీ క్యాపిటల్, ఇతర కంపెనీల్లో వాటాలుండటం... సానుకూలాంశాలు. మరో గ్రూప్‌ కంపెనీ వొడాఫోన్‌ ఐడియా రుణ భారం భారీగా ఉండటం, (ఈ రుణానికి గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఎలాంటి కార్పొరేట్‌ గ్యారంటీని ఇవ్వకపోవడంతో ఇది పెద్ద ప్రతికూలాంశం కాబోదు), సిమెంట్, వీఎస్‌ఎఫ్‌ ధరలు తగ్గే అవకాశాలు, వీఎస్‌ఎఫ్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశాలు.... ప్రతికూలాంశాలు.

బాటా ఇండియా బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.1,736  టార్గెట్‌ ధర: రూ.1,955
ఎందుకంటే: బాటా ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆర్థికఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. మందగమన నేపథ్యంలో కూడా ఈ కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.722 కోట్లకు పెరిగింది. ప్రీమియమ్‌(ఖరీదైన) ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా స్థూల మార్జిన్లు 60 బేసిస్‌ పాయింట్లు పెరిగి 54.4 శాతానికి, నిర్వహణ లాభ మార్జిన్‌ అర శాతం పెరిగి 13.5 శాతానికి పెరిగాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా నికర లాభం 27 శాతం ఎగసి రూ.71 కోట్లకు పెరిగింది. కొత్త ట్రెండీ కలెక్షన్‌లను అందుబాటులోకి తెస్తుండటం, మార్కెటింగ్‌ వ్యయాలు పెంచుతుండటం, ప్రస్తుత స్టోర్‌ మోడళ్లను రీ డిజైనింగ్‌ చేయడం తదితర చర్యల కారణంగా ఈ కంపెనీ బ్రాండ్‌ ఇమేజ్‌ ‘మాస్‌’ నుంచి ‘ప్రీమియమ్‌’కు మారుతోంది.

ఫ్రాంచైజీ స్టోర్స్‌తో కలుపుకొని దేశవ్యాప్తంగా 1,420 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది.  ఐదేళ్లలో 500 ఫ్రాంచైజీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు, యువత కేటగిరీలో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండటం, ప్రీమియమ్‌ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరిస్తుండటం, ప్రకటనల కోసం అధికంగానే ఖర్చు చేస్తుండటం, స్థూల లాభం మెరుగుపడే అవకాశాలుండటం, ఎలాంటి రుణ భారం లేకపోవడం, రూ.800 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటం....సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top