సాగుకు బడ్జెట్‌లో పెద్దపీట వేయాలి.. | Budget for cultivation | Sakshi
Sakshi News home page

సాగుకు బడ్జెట్‌లో పెద్దపీట వేయాలి..

Dec 11 2017 2:38 AM | Updated on Dec 11 2017 2:38 AM

Budget for cultivation  - Sakshi

న్యూఢిల్లీ: ఖరీఫ్‌ సీజన్‌లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వల్ల రెండో క్వార్టర్‌లో వృద్ధి మందగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని అసోచామ్‌ సూచించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే వ్యవసాయరంగ జీవీఏ జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్‌లో అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 4.1 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఈ క్షీణత చాలా వేగంగా ఉన్నట్టు లెక్క.

2016–17 ఆర్థిక సంవత్సరపు రెండో క్వార్టర్‌లో ఉన్న 10.7 శాతం వృద్ధితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2.8 శాతం క్షీణించిందని అసోచామ్‌ తెలియజేసింది. రెండో అంచె రుతుపవనాలు ఖరీప్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. వ్యవసాయ రంగంలో సగానికిపైగా జీవీఏ పశువులు, మత్స్య పరిశ్రమ, ఫారెస్ట్రీ నుంచే సమకూరుతోందని, ఆర్థిక మంత్రి జైట్లీ ప్రధానంగా ఈ విభాగాలతోపాటు సాగుకు కీలకమైన నీటిపారుదలపై దృష్టి పెట్టాలని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ సూచించారు. ‘‘మన జనాభాలో అధిక శాతం గ్రామీణ సాగుపైనే ఆధారపడి ఉంది. సాగు రంగాన్ని ఒత్తిళ్ల నుంచి బయటపడేస్తే తప్ప వినియోగం ఆధారిత వృద్ధి, పెట్టుబడులు వాస్తవ స్థితికి చేరలేవు’’ అని రావత్‌ పేర్కొన్నారు.

ఎస్‌ఎంఎస్‌ మోసాలపై ఆర్‌బీఐ హెల్ప్‌లైన్‌
న్యూఢిల్లీ:
ఆర్‌బీఐ పేరుతో కొందరు వ్యక్తులు, సంస్థలు చేస్తున్న మోసాలపై అప్రమత్తం చేసేందుకు గాను రిజర్వుబ్యాంక్‌... ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అవగాహన ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఈ తరహా మోసాలపై హెచ్చరించేందుకు మిస్డ్‌ కాల్‌ హెల్ప్‌లైన్‌ కూడా ఆరంభించింది. ఆర్‌బీఐ పేరుతో లాటరీలు, నగదు బహుమానం వచ్చిందంటూ కొందరు కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్‌ ద్వారా సంప్రదిస్తూ, వాటిని విడుదల చేసేందుకు నిర్ణీత మొత్తం ఫీజుగా చెల్లించాలంటూ మోసాలకు పాల్పడుతుండడంతో ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది. 

మిస్డ్‌ కాల్‌ హెల్ప్‌లైన్‌ నుంచి ఈ తరహా మోసాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు, మోసపోతే ఫిర్యాదు చేసే విధానం తెలుసుకోవచ్చు.  ఇటువంటి సందర్భాల్లో తగిన సమాచారం కోసం 8691960000 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని సూచించింది. అలాగే, స్థానిక సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా  ట్చఛిజ్ఛ్టి.టbజీ.ౌటజ.జీn పోర్టల్‌లోనూ ఫిర్యాదు నమోదు చేయవచ్చని తెలియజేసింది.


 

Advertisement
 
Advertisement
Advertisement