ఫార్చూన్‌ 40లో  నలుగురు భారతీయులు 

4 Indian-origin persons in Fortune's 40 under 40 list - Sakshi

న్యూయార్క్‌: పిన్న వయస్సులోనే వ్యాపార రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న 40 మంది ప్రముఖుల జాబితాలో భారత సంతతికి చెందిన వారు నలుగురు చోటు దక్కించుకున్నారు. 40 ఏళ్ల లోపు వయస్సు గల 40 మంది ప్రముఖులతో ఫార్చూన్‌ మ్యాగజైన్‌ ఈ జాబితాను రూపొందించింది. ‘40 అండర్‌ 40’ లిస్టులో జనరల్‌ మోటార్స్‌ సీఎఫ్‌వో దివ్య సూర్యదేవర (4వ స్థానం), విమియో సీఈవో అంజలీ సూద్‌ (14), రాబిన్‌హుడ్‌ సహవ్యవస్థాపకుడు బైజూ భట్‌ (24), ఫిమేల్‌ ఫౌండర్స్‌ ఫండ్‌ వ్యవస్థాపక భాగస్వామి అను దుగ్గల్‌ (32వ స్థానం) ఉన్నారు. ఈ జాబితాలో ఇన్‌స్టాగ్రామ్‌ సహ వ్యవస్థాపకుడు కెవిన్‌స్ట్రామ్, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిల్చారు. జనరల్‌ మోటార్స్‌ తొలి మహిళా సీఎఫ్‌వోగా దివ్య సూర్యదేవర చరిత్ర సృష్టించారని ఫార్చూన్‌ పేర్కొంది. ఫార్చూన్‌ 500 కంపెనీల్లోని కేవలం రెండు కంపెనీల్లో మాత్రమే మహిళా సీఈవో, సీఎఫ్‌వోలు ఉన్నారని వివరించింది.  

ఈసారి ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల ముఖచిత్రాన్ని మారుస్తున్న యువ సూపర్‌స్టార్స్‌తో అనుబంధ లిస్టును కూడా ఫార్చూన్‌ మ్యాగజైన్‌ రూపొందించింది. ‘లెడ్జర్‌ 40 అండర్‌ 40’లో కరెన్సీ ఎక్సే్చంజ్‌ రిపుల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆశీష్‌ బిర్లా, డిజిటల్‌ కరెన్సీ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్‌ సీటీవో బాలాజీ శ్రీనివాసన్, ఎంఐటీ డిజిటల్‌ కరెన్సీ ఇనీషియేటివ్‌ డైరెక్టర్‌ నేహా నరులా, కాయిన్‌బేస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టీనా భట్నాగర్‌ ఉన్నారు.    

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top
>