సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రహదారుల దిగ్బంధం రెండవ రోజు గురువారం కూడా విజయవంతంగా ముగిసింది.
దిగ్బంధం సక్సెస్
Nov 8 2013 2:04 AM | Updated on Aug 24 2018 2:33 PM
గుంటూరు, న్యూస్లైన్ :సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రహదారుల దిగ్బంధం రెండవ రోజు గురువారం కూడా విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని జాతీయ రహదారితోపాటు ప్రధాన రహదారులను దిగ్బంధం చేసి వంటావార్పు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు. అధిక సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొని సమైక్యానికి మద్దతు పలికారు.అంతటా సమైక్య నినాదాలు మిన్నంటాయి.చిలకలూరిపేటలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర కోరుతూ నినాదాలు చేశారు.మంగళగిరి నియోజకవర్గంలో గుంటూరు,కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేపట్టారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు వద్ద సత్తెనపల్లి-నరసరావుపేట ప్రధాన రహదారిని పార్టీ అధికార ప్రతినిధి, అంబటి రాంబాబు ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. విభజన నిర్ణయం వాయిదా వేసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల, తాళ్లపల్లి రహదారులను దిగ్బంధం చేశారు. నరసరావుపేటలో పార్టీ సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం, రొంపిచర్ల మర్రిచెట్టు పాలెం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. పొన్నూరు సమన్వయకర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో గుంటూరు-చీరాల రోడ్డులోని మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్లు దిగ్బంధం చేశారు.
భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వినుకొండలో సమన్వయకర్త డాక్టర్ సుధ ఆధ్వర్యంలో ఈపూరు మండల పరిధిలోని కొండ్రముట్ల వద్ద రహదారులను దిగ్బంధం చేశారు. దీంతో వినుకొండ- హైదరాబాద్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు ముగ్గురు ఒకేచోట రహదారుల దిగ్బంధం చేశారు. మందపాటి శేషగిరిరావు, ఈపూరు అనూఫ్, కొల్లిపర రాజేంద్రప్రసాద్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. వేమూరు నియోజకవర్గంలో మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో అమృతలూరులోని తెనాలి-చెరుకుపల్లి రహదారిలో, చుండూరు మండల కేంద్రంలో తెనాలిలో రహదారులు దిగ్బంధం చేసి రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు.
బాపట్ల నియోజకవర్గంలో సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో దిగమర్రు వద్ద ప్రధాన జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. గడియార స్తంభం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. పట్టణ, మండల కన్వీనర్లు దగ్గుమల్లి ధర్మారావు, గవిని కష్ణమూర్తి, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, అహ్మద్ హుసేన్ పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల వద్ద అద్దంకి- హైదరాబాద్ రహదారిని దిగ్బంధం చేసి ఆందోళన చేపట్టారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు- సత్తెనపల్లి రహదారిని సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నూతలపాటి హనుమయ్య ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. తెనాలి నియోజకవర్గంలో గుదిబండి చినవెంకటరెడ్డి, గల్లా చందు ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో రహదారిని దిగ్బంధం చేసి వంటావార్పు నిర్వహించారు. రేపల్లె నియోజకవర్గంలో చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం వద్ద జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. మోపిదేవి హరనాధ్బాబు, దివాకర్త్న్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిలానీ, విజయసారధి ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధం చేశారు.
గుంటూరులో...
గుంటూరులోని అంకిరెడ్డిపాలెం వై జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు వంటావార్పు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షౌకత్, నసీర్ అహ్మద్, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఏటూకూరు రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ కన్వీనర్ కావటి మనోహర్నాయుడు ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేశారు.
భారీగా నిలిచిన వాహనాలు
రహదారుల దిగ్బంధం కారణంగా జిల్లాలో అనేక చోట్ల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. 20 నుంచి 25 కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్ లు, లారీలు నిలిచిపోయాయి. చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్లు నిలిచిపోయాయి. గుంటూరు నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రహదారుల దిగ్బంధంలో అంకిరెడ్డిపాలెం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నాగుల చవితి సందర్భంగా రహదారిపైనే శివలింగాన్ని ఏర్పాటు చేసి మహిళలు పూజలు నిర్వహించారు. మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలో రోడ్లపై మూడు గంటలపాటు లారీలు, బస్లు నిలిచిపోయాయి.
Advertisement


