టీడీపీ నేతల తీరు అనుమానాస్పదం 

YSRCP Leader Lella Appi Reddy Comments On TDP Leaders - Sakshi

నిషేధిత ప్రాంతాలను డ్రోన్‌లతో ఎందుకు చిత్రీకరించారు?  

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు  పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి

పట్నంబజారు (గుంటూరు): కొద్ది కాలంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నేతల తీరు  అనుమానాస్పందంగా ఉందని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అను మతి లేనిదే లోనికి ప్రవేశించలేని సచివాలయ పరిసరాలను రాజధాని పర్యటనలో భాగంగా మాజీ మంత్రి లోకేష్, కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు డ్రోన్‌ల ద్వారా చిత్రీకరించారని, ఇలా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు అరండల్‌పేటలోని తన కార్యాలయంలో అప్పిరెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని పర్యటనలో భాగంగా చంద్రబాబు రోడ్లపై తిరుగుతుంటే, చినబాబు లోకేష్‌ సచి వాలయం వద్ద చక్కర్లు కొట్టారని విమర్శించారు. కృష్ణానదిలో వరదలకు సంబంధించి వస్తున్న నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్‌లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తే నానా యాగీ చేసిన చంద్రబాబు అండ్‌ కో ఇప్పుడు అనుమతి లేని సచివాలయ ప్రాంతంలో డ్రోన్‌లు ఎలా వినియోగించారో చెప్పాలని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి, కేబినెట్‌ మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే ఆయా ప్రాంతాలకు సంబంధించి డ్రోన్‌లతో చిత్రీకరించడం అనుమానం కలిగిస్తోందని పేర్కొన్నారు. దీనిపై తాము తుళ్లూరు సబ్‌ డివిజన్‌ డీఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అత్యంత భద్రత కలిగిన, వీవీఐపీలు ఉండేప్రదేశంలో అక్రమంగా డ్రోన్‌లతో చొరబడిన వారిపై కేసులు నమోదుచేయాలని కోరినట్లు తెలిపారు. ఏదైనా కుట్రలో భాగంగా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతోందని ఆరోపించారు.  వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లాల్‌పురం రాము, అత్తోట జోసఫ్, అంగడి శ్రీను, తోట వీరాంజనేయులు పాల్గొన్నారు.  

డ్రోన్‌ కెమెరాల వినియోగంపై డీఎస్పీకి ఫిర్యాదు.. 
తుళ్లూరురూరల్‌ (తాడికొండ): మాజీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం చేపట్టిన అమరావతి పర్యటనలో డ్రోన్‌ కెమెరాలను వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం తుళ్లూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ తదితర కీలక ప్రదేశాల్లో అనుమ తులు లేకుండా డ్రోన్‌ కెమెరాలను వినియోగించి విడియో తీయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ చర్య ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధుల భద్రతకు ముప్పు కలిగించే అంశమని పేర్కొన్నారు. భద్రతకు ముప్పు కలిగే అంశంగా పరిగణించి డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరణ చేపట్టిన మాజీ మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top