
‘రేప్ చేయబోయాడని ఫిర్యాదు చేస్తా’
రాజధాని ప్రాంతంలో యువకులు శృతి మించి వ్యవహరిస్తున్నారు.
► రాజధానిలో అర్ధరాత్రి పార్టీలు
►పలుచోట్ల యువత మధ్య ఘర్షణలు
►మద్యం, డ్రగ్స్ మత్తులో అరాచకాలు
తాడేపల్లి: రాజధాని ప్రాంతంలో యువకులు శృతి మించి వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ గంజాయి మత్తులో ఉండడంతో సదరు కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించి, కానిస్టేబుల్ను కొట్టడానికి సిద్ధమయ్యారు. సదరు కానిస్టేబుల్ గట్టిగా ప్రశ్నించడంతో రేప్ చేయబోయాడని ఫిర్యాదు చేస్తానంటూ ఆ యువతి బెదిరింపులకు పాల్పడింది. దాంతో పోలీసులు స్థానిక రైతులను ఆశ్రయించడంతో రైతులు బుద్ధి చెప్పారు.
29 గ్రామాల్లో పంట పొలాలన్నీ ఖాళీగా ఉండడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి యువత ఇక్కడకు చేరి రాత్రి సమయంలో పార్టీలు చేసుకుంటూ మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో ఊగిసలాడుతున్నారు. అలా పార్టీలు జరిగే సమయంలో చిన్నపాటి ఘర్షణలైనా ఒకరినొకరు కొట్టుకోవడం, బ్యాచ్లుగా విడిపోయి ఐదారు రోజులు అదే గొడవలో నిమగ్నమవుతున్నారు. ఈ మధ్యకాలంలో మంగళగిరి శివార్లలో ఒక కాలేజీ యువకుడిని మరో కాలేజీకి చెందిన యువకులు దారుణంగా కొట్టి రోడ్డుపై పడవేసి వెళ్లిపోయారు.
పోలీసుల దృష్టికి వచ్చినా తన్నులు తిన్న యువకుడు, అతని తల్లితండ్రులు పోలీసులకు సహకరించకపోవడంతో ఆ విషయం కాస్తా అటకెక్కింది. ముఖ్యంగా కృష్ణాయపాలెం, మంగళగిరి–కృష్ణాయపాలెం రోడ్డు, ఉండవల్లి–అమరావతి కరకట్ట నుంచి రాయపూడి వరకు వివిధ ప్రాంతాల్లో, తాడేపల్లి పట్టణ పరిధిలోని కుంచనపల్లి డొంకరోడ్లలోను, వడ్డేశ్వరం, గుండిమెడ, మెల్లెంపూడి, ఇప్పటం తదితర ప్రాంతాల్లో ఆడమగా తేడా లేకుండా పార్టీలు నిర్వహించుకుంటూ మత్తులో ఊగిసలాడుతున్నారు.
ఈ మధ్య కాలంలో మెల్లెంపూడి–గుండిమెడ రోడ్డులో నలుగురు యువకులు ఓ యువతిని తీసుకొచ్చి గంజాయి సేవిస్తుండగా రైతు ప్రశ్నించి అక్కడ నుంచి వెళ్లిపొమ్మని సూచించాడు. దాంతో సదరు యువకులు ఆ యువతిని కార్లో పంపించి, రైతుపై దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. అలాగే ఉండవల్లి గుహల నుంచి సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో యువతీ యువకులు మద్యం మత్తులో రోడ్డుపై బహిరంగ శృంగారం చేస్తుండడంతో సీఎం విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బంది మందలించారు. ఇలా రాజధానిలో ఎక్కడ చూసినా యువత మద్యం, డ్రగ్స్ మత్తులో స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి గ్రామాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.