అమ్మో.. విజయవాడ | Vijayawada is more expensive than Hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మో.. విజయవాడ

Aug 8 2017 9:41 AM | Updated on Sep 11 2017 11:36 PM

హైదరాబాద్‌ కంటే విజయవాడలో జీవించడం కష్టంగా మారింది..



అమరావతి బ్యూరో:
 
రాజధాని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చింది. దాంతో చాలామంది ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే యూడీసీగా పనిచేసే రమేశ్‌ కూడా తన భార్య, ఇద్దరు పిల్లలతో  విజయవాడకు మకాం మార్చాల్సి వచ్చింది. బెజవాడ అంటే ఎండలే కాదు.. ఇక్కడ ధరలూ సెగలు పుట్టిస్తాయనే వాస్తవం అతనికి తొందరగానే తెలిసింది. నగరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి అద్దె నెలకు రూ.16 వేల వరకు ఉందని తెలుసుకుని అవాక్కయ్యాడు. శివారు కాలనీలకు వెళ్లాడు.
 
అక్కడా.. రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉన్నాయి. ఇలా ఒక్క ఇల్లే కాదు.. స్కూలు ఫీజులు, కూరగాయలు, సినిమా టికెట్‌ ధరలు, ఆస్పత్రి చార్జీల వరకు అన్నీ సామాన్యుడి నడ్డి విరిచేలానే ఉన్నాయని రమేశ్‌కు బోధపడింది. ఇది ఒక్క అతని పరిస్థితే కాదు. రాజధానిలో సామాన్యుడి దుస్థితి. ఇక్కడ జీవనం అంటేనే తలకుమించిన భారంగా మారుతోంది. రాజధానిగా మారిన తర్వాత విజయవాడ జనాభా 14 లక్షలకు చేరి ఉంటుందని అంచనా. ఇక్కడ దాదాపు 80 శాతం మంది పేద, మధ్యతరగతి వర్గాలే. ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. 
 
1.పాఠశాలల ‘ఫీ’జులుం’!
 
విజయవాడ కానూరుకు చెందిన సాయిరాం తన కుమార్తె శ్రీజను 8వ తరగతి, కుమారుడు శ్రీకర్‌ను 7వ తరగతిలో చేర్పించారు. అందుకోసం నగరంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలకు వెళ్లారు. ‘మాది ఇంటిగ్రేటెడ్‌ సిలబస్‌.. మీ పిల్లలిద్దరికీ కలిపి బోధన రుసుము రూ. 1.50 లక్షలు అవుతుంది’ అని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ చెప్పడంతో సాయిరాం అవాక్కయ్యాడు.
 
8వ తరగతికి రూ.80 వేలు, ఏడో తరగతికి రూ.70 వేలు అని లెక్కచెప్పడంతో ఆయనకు నోట మాట రాలేదు. దీంతో సమీపంలోని మరో ప్రముఖ కార్పొరేట్‌ పాఠశాలకు వెళ్లారు. అక్కడా పుస్తకాలు, ఫీజులన్నీ కలిపి ఇద్దరికీ రూ. 3.40 లక్షలు అవుతుందనడంతో ఆయన హతాశుడయ్యారు. ఫీజుల విషయం ఇలా ఉంటే.. దుస్తులు, పుస్తకాలు, టై, బెల్టు, యూనిఫామ్స్‌ అన్నీ మా దగ్గరే కొనాలి అంటూ ముక్కుపిండి మరీ కొనిపిస్తున్నారు.
 
బయట మార్కెట్‌లో రూ.వేయికి అందుబాటులో ఉన్న నోటు పుస్తకాలను కార్పొరేట్‌ పాఠశాలల్లో రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఇక వర్క్‌షీట్లు, ఇతరత్రా అని చెప్పి రూ.750 కూడా చేయని పుస్తకాలకు మరో రూ.2వేలు గుంజుతున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలను మాత్రం కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారు.
 
అలాగే, ఓ ఒలింపియాడ్‌ పాఠశాలలో గత ఏడాది ఆరో తరగతి విద్యార్థికి రూ. 40 వేలు వసూలు చేశారు. ప్రస్తుతం ఏడో తరగతికి వచ్చేసరికి ఫీజు రూ.45 వేలకు పెరిగిపోయింది. వర్క్‌బుక్స్, దుస్తులు, ఇతర సామగ్రి మరో రూ.7 వేల ఖర్చు అదనం. కళలు, సాంకేతిక అంశాల్లో శిక్షణ అంటూ వసూలు చేసే మొత్తాలు అదనం. నగరంలో ఉన్న దాదాపు 250 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే తరహాలో దోపిడీ జరుగుతోంది. 
 
2.ఆటో, క్యాబ్‌ చార్జీల భారం
హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలతో పోల్చిచూస్తే విజయవాడలో ట్యాక్సీ, ఆటో చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైల్వేస్టేషన్‌ నుంచి 10 కి.మీ. దూరంలోని కరెన్సీనగర్‌కు ఆటో చార్జీ రూ.150 తీసుకుంటున్నారు. ఆటో కనీస చార్జీ రూ.50. నగరంలో దాదాపు 13 వేల ఆటోలు, 3 వేల ట్యాక్సీలు, క్యాబ్‌లు ఉన్నాయి. ఇక ప్రధాన రోడ్డు పాయింట్లలో తప్ప అంతర్గత రోడ్లలో ఆటో స్టాండులు తక్కువే. అక్కడ ఆటో డ్రైవర్లు ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే. ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండుకు ఆటోచార్జీ రూ.125, దుర్గగుడి మెట్ల మార్గం వరకు అయితే రూ.200 తీసుకుంటున్నారు. 
 
హైదరాబాద్‌లో ఇలా...
విజయవాడ కంటే హైదరాబాద్‌లోనే ఆటో, క్యాబ్‌ చార్జీలు తక్కువగా ఉండటం గమనార్హం. 
 
♦ ఆటో చార్జీలు...
సికింద్రాబాద్‌ నుంచి 8 కి.మీ.దూరం ఉన్న మహాత్మగాంధీ బస్‌ టెర్మినల్‌ (ఎంజీబీఎస్‌)కు వెళ్లాలి అంటే ఆటోకు రూ.80.
సికింద్రాబాద్‌ నుంచి 9 కి.మీ.దూరంలోని ఉప్పల్‌కు ఆటోలో రూ.110.
సికింద్రాబాద్‌ నుంచి 19 కి.మీ.దూరంలోని హైటెక్‌ సిటీ రూ.190. 
 
♦ క్యాబ్‌ చార్జీలు ఇలా..
సికింద్రాబాద్‌ నుంచి (ఎంజీబీఎస్‌) రూ.89 (ఒక్కరికీ).. రూ.158 (నలుగురికి)
సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ రూ.69 (ఒక్కరికీ) రూ.129 (నలుగురికి)
సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌ సిటీ రూ.168 (ఒక్కరికీ) రూ.288 (నలుగురికి)


 
3.అద్దెలు.. సామాన్యుడిపై మద్దెల మోతే
 
విజయవాడలో గత రెండేళ్లలో ఇళ్ల అద్దెలు 40 శాతానికి పైగా పెరిగాయి. హైదరాబాద్‌ కంటే విజయవాడలోనే ఇళ్ల కిరాయిలు ఎక్కువగా ఉన్నాయని రాజధాని నుంచి తరలివచ్చిన ఉద్యోగస్తులు చెబుతున్నారు.. హైదరాబాద్‌లో లక్డీకాపూల్, శ్రీనగర్‌ కాలనీ, ఖైరతాబాద్, ఆనంద్‌నగర్‌ కాలనీ తదితర ప్రధాన ప్రాంతాల్లో సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ రూ.8000కు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ రూ.13,000కు, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ 18,000లకు కిరాయికి ఇస్తున్నారు.
 
విజయవాడలోని గాంధీనగర్, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, వన్‌టౌన్, సత్యనారాయణపురం, పటమట తదితర ప్రధాన ప్రాంతాల్లో సింగిల్‌ బెడ్‌రూమ్‌ రూ.10,000లకు, డబుల్‌ బెడ్‌రూమ్‌ 16,000కు, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ రూ.20–22వేలకు అద్దెకిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, వనస్థలిపురం, చందానగర్, నాగోలు, మల్కాజ్‌గిరి, మౌలాలి వంటి ప్రాంతాల్లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ రూ.5,500లకు, డబుల్‌ బెడ్‌రూమ్‌ రూ.7000కు, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ 10,000లకు కిరాయికి ఇస్తుంటే..
 
విజయవాడలో నగర శివారు ప్రాంతాలైన గంగూరు, కంకిపాడు, నిడమానూరు, గొల్లపూడి, నున్న తదితర ప్రాంతాల్లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ రూ.7,000, డబుల్‌ బెడ్‌రూమ్‌ రూ.10,000లకు, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ రూ.15,000లకు అద్దెలకు ఇస్తున్నారు. ఇక డీలక్స్‌ ఫ్లాట్స్‌ విజయవాడలో రూ.పాతిక వేలు నుంచి రూ.30   వేల వరకు పలుకుతున్నాయి.
 
4. ట్రాఫిక్‌ అంటేనే బెంబేలు
విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు విజయవాడ ప్రధాన కూడలిగా ఉంది. రాజధానిగా రూపాంతరం చెందిన తర్వాత వాహనాల సంఖ్య అమాంతంగా పెరిగింది. 2015 లెక్కల ప్రకారం నగరంలో రోజుకు సగటున 3 లక్షలకుపైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ రెండేళ్లలో వాటి సంఖ్య మరో 50 వేలు పెరిగి ఉంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండేళ్లలో నగరంలో ఒక్క రోడ్డు కూడా విస్తరించనేలేదు.
 
ప్రధాన రోడ్లను అనుసంధానించే లింకు రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. వన్‌టౌన్‌లో ప్రయాణమంటేనే హడలిపోవాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డు ప్రధాన రోడ్లను అనుసంధానించే జంక్షన్‌లలో ట్రాఫిక్‌ జామ్‌ సర్వసాధారణమైపోయింది.
 
ఇష్టానుసారంగా పార్కింగ్‌ చేస్తుండటంతో ట్రాఫిక్‌ సంక్లిష్టంగా మారుతోంది. 2015లో నగరంలోని 28 ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై సర్వే నిర్వహించారు. ఆ ప్రాంతాల ద్వారా రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య, పీక్‌ అవర్‌ (సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల)లో ప్రయాణించే వాహనాలపై సర్వే చేశారు. వాటిలో ప్రధానమైన 5 జంక్షన్లలో పరిస్థితి ఇలా ఉంది...  
 
విజయవాడ శివారులోని పెనమలూరు నుంచి 13 కి.మీ. దూరంలో ఉన్న ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు బస్సు ప్రయాణం గంటన్నర పడుతోంది. ఆదే బైక్‌ మీద అయితే 45 నిమిషాలు, ఆటోలో అయితే గంటసేపు పడుతోంది. 
 
కరెన్సీనగర్‌ నుంచి ఏలూరు రోడ్డు ద్వారా రైల్వేస్టేషన్‌కు 10 కి.మీ. బస్సు ప్రయాణం గంటసేపు పడుతోంది. ఆటోలో అయితే 45 నిమిషాలు పడుతోంది. నగర శివారులోని ప్రసాదంపాడు నుంచి బెంజ్‌ సర్కిల్‌కు రావడానికి గంటన్నర పడుతోంది. 
 
ఇక విజయవాడ పాతబస్తీలో ప్రయాణమంటేనే హడలిపోవాల్సి వస్తోంది. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి వన్‌టౌన్‌కు రావడానికి ఆటో డ్రైవర్లు ససేమిరా అంటున్నారు. 
 

 
♦ హైదరాబాద్‌లో ఇలా...
హైదరాబాద్‌లో దాదాపు 50 లక్షల వాహనాలు ఉన్నాయి. కానీ, విజయవాడ కంటే హైదరాబాద్‌ రోడ్లపైన కాస్త త్వరగా గమ్యానికి చేరుకోగలుగుతుండటం విశేషం. హైదరాబాద్‌లో 280 కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను  ఏర్పాటు చేశారు. 2,600 మంది సిబ్బందితో ట్రాఫిక్‌ వ్యవస్థను నియంత్రిస్తున్నారు.
 
5.కూర ‘గాయాలు’
 
విజయవాడలో కూరగాయల« ధరలూ భగ్గుమంటున్నాయి. నలుగురు సభ్యులున్న కుటుంబానికి వారానికి సరిపడా చేతి సంచి కూరలు కొనాలంటే ఏడాది క్రితం రూ.150 నుంచి రూ.200 అయ్యేది. ఇప్పుడు రూ.300 వెచ్చించాల్సి వస్తోంది. రిటైల్‌ మార్కెట్‌తో పోల్చితే రైతుబజార్‌లో కూరల ధరలు తక్కువగా ఉన్నా నాణ్యమైన ఆకు, కాయగూరలు లభించడంలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రిటైల్‌ మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు.  
 
♦ రాజధాని ఎఫెక్ట్‌!
ఇదిలా ఉంటే.. గతంలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో పండే క్యాబేజ్, దొండ, దోస, బీర వంటి కూరగాయల ధరలు కేజీ ఐదారు రూపాయలు మించి ఉండేవి కావు. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పంటలు వేయకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే కూరగాయలపైనే ప్రధానంగా ఆధారపడాల్సి వస్తోంది. దాంతో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకప్పుడు విజయవాడ స్వరాజ్య మైదానానికి రోజు ఆరేడు లారీల కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం రెండు మూడు లారీల సరుకు మాత్రమే వస్తోంది. 
 
6. ఆస్పత్రులు
ఆస్పత్రుల ఫీజుల విషయంలోనూ హైదరాబాద్‌తో విజయవాడ పోటీపడుతోంది. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రున్నాయి. అక్కడ చికిత్సలకు ఉపయోగించే పరికరాలు అత్యాధునికమైనవి.  నర్సింగ్, కేరింగ్‌తో పాటు ఆస్పత్రుల నిర్వహణ  కూడా మెరుగ్గా ఉంటుంది. అక్కడి సౌకర్యాలతో పోలిస్తే విజయవాడ వెనుకబడి ఉన్నా ఫీజుల వసూలులో మాత్రం ఇక్కడి కొన్ని ఆస్పత్రులు హైదరాబాద్‌ ఆస్పత్రులతో పోటీ పడుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement