విజ్ఞాన్‌ యూనివర్సిటీ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

Vignan University Admission Notification Released - Sakshi

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్‌లో బీటెక్, బీఫార్మసీ ప్రవేశ పరీక్ష 

ప్రతిభావంతులకు వివిధ దశల్లో రాయితీలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వ విద్యాలయంలో 2019–20 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ గురువారం విడుదల చేశారు. గుంటూరులో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీటెక్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు  ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకూ ఆన్‌లైన్‌లో (వీశాట్‌– 2019, వీజెట్‌–2019) ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని దీనికి ఏప్రిల్‌ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీశాట్‌ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రిలోని అన్ని విజ్ఞాన్‌ సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

వీశాట్‌లో తొలి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 75 శాతం, 51–100 లోపు ర్యాంకుల వారికి 50 శాతం, వంద నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన వారికి 25 శాతం, 201 నుంచి 2 వేల లోపు ర్యాంకు సాధించిన వారికి 10 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంటర్‌ మార్కులు, జేఈఈ ప్రిలిమ్స్, మెయిన్స్, ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగాను ఫీజు రాయితీ ఉంటుందన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంటెక్, ఎంబీఏ కోర్సులకు సైతం ఫీజుల్లో రాయితీ పొందొచ్చని చెప్పారు. అన్ని విభాగాల్లో 25 శాతం సీట్లను ఫీజు రాయితీ కింద కేటాయించామని వివరించారు. వీటిని పూర్తిగా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. వీశాట్‌ పరీక్ష రాసిన వారికి బీటెక్‌ సీట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ వి.రవికుమార్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు, డాక్టర్‌ కేవీ కృష్ణకిషోర్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top