కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలతో ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువ పతనం అవుతోందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయ పడ్డారు.
కర్నూలు(రాజ్విహార్), న్యూస్లైన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలతో ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువ పతనం అవుతోందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయ పడ్డారు. ఆదివారం స్థానిక కార్మిక కర్షక భవన్లో ఎంప్లాయీస్, టీచర్స్, ప్రొఫెషనల్స్ స్డడీ ఫోరం ఆధ్వర్యంలో రూపాయి పతనం- కారణాలు - పరిష్కారం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ..1991 నుంచి కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో విదేశీ మారకద్రవ్యం, కరెంటు అకౌంట్ లోటు పెరిగిపోయి ధరలు పెరిగిపోతున్నాయన్నారు. దీంతో ఆర్థిక శాస్త్రం ఓ అర్థం కాని శాస్త్రంగా మారిందని పేర్కొన్నారు.
దేశంలోకి చమురు దిగుమతి 76శాతం ఉందని, డాలర్లలో బిల్లు చెల్లిస్తున్నందువల్ల చమురు ధరలు పెరిగిపోతున్నాయని వెల్లడించారు. పలు అంశాల్లో సామాన్యులపై భారం పెరిగినా సంపన్నులపై తగ్గడం హాస్యాస్పదమన్నారు. విలాసవంతమైన వస్తువులు, ఉపకరణాలను దిగుమతి చేసుకోవడం ఆపాలని సూచించారు. ప్రొడక్షన్ షేరింగ్ అగ్రిమెంట్తో చమురు కొనుగోళ్ల భారం పెరిగి ప్రజలపై పడుతోందన్నారు. ఈ సదస్సులో ఫోరం కన్వీనర్ బిఎల్ఎన్ ప్రసాద్ శర్మ, నాయకులు సురేష్, బడేసాహెబ్, నరసింహ, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.