
పంటలను ప్రభుత్వమే కొనాలి
‘సంక్రాంతి అంటే రైతుల పండుగ. రైతన్న కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. మార్కెట్లో రైతులకు అన్యాయం జరుగుతోంది.
రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన: గవర్నర్
కదిరి: ‘సంక్రాంతి అంటే రైతుల పండుగ. రైతన్న కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. మార్కెట్లో రైతులకు అన్యాయం జరుగుతోంది. అక్కడంతా దళారుల హవా నడుస్తోంది. వారే లాభాలు గడిస్తున్నారు. రైతన్న మాత్రం పెట్టుబడులు కూడా చేతికందక నష్టపోతున్నాడు. అందుకే రైతు పండించిన పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే మంచిది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి’ అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని పేర్కొన్నారు. మళ్లీ పాత రోజులు రావాలని కోరారు. గవర్నర్ వెంట మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, వైఎస్సార్సీపీ స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా తదితరులున్నారు.