పెట్టుబడులు పెట్టే సమయంలో.. చాలామంది మార్కెట్ పతనాలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పులు, ఆర్థిక పరిస్థితులను ప్రధాన ప్రమాదాలుగా భావిస్తారు. కానీ.. దీర్ఘకాలంలో పెట్టుబడిదారుడి విజయాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది మార్కెట్ కదలికలు కాదని, వాటికి మనం ఎలా స్పందిస్తామనేదే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అంటే.. పెట్టుబడుల్లో అతిపెద్ద ప్రమాదం చాలాసార్లు మన భావోద్వేగాలే అవుతాయి.
చరిత్రను పరిశీలిస్తే.. ప్రతి మార్కెట్ సంక్షోభానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. డాట్కామ్ బబుల్ సమయంలో టెక్నాలజీ కంపెనీలపై అధిక అంచనాలు మార్కెట్ను ప్రభావితం చేశాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం గృహ రుణాలు, అధిక అప్పుల కారణంగా వచ్చింది. కోవిడ్ సమయంలో మహమ్మారి కారణంగా మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఇటీవల ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల ఆందోళనను పెంచాయి.
అయితే.. ఈ సంక్షోభాలన్నింటిలో ఒక విషయం మాత్రం సాధారణంగా కనిపించింది. మార్కెట్లు పడిపోయినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు భయంతో తమ పెట్టుబడులను విక్రయించారు. నష్టాలను తప్పించుకోవాలనే ఆలోచనతో మార్కెట్ నుంచి బయటకు వచ్చారు. కానీ చాలాసార్లు అదే సమయంలో మార్కెట్లు తిరిగి కోలుకోవడం ప్రారంభించాయి. ఫలితంగా, బయటకు వచ్చిన పెట్టుబడిదారులు ఆ రికవరీలో వచ్చే అవకాశాలను కోల్పోయారు.
మార్కెట్ పతనంలో రెండు రకాల నష్టాలు ఉంటాయి. మొదటిది మార్కెట్ కారణంగా వచ్చే తాత్కాలిక నష్టం. రెండోది పెట్టుబడిదారుడి నిర్ణయాల వల్ల వచ్చే నష్టం. చాలా సందర్భాల్లో రెండో రకమైన నష్టమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మంచి పెట్టుబడులు ఉన్నప్పటికీ, సరైన సమయంలో భయంతో బయటకు రావడం వల్ల దీర్ఘకాలిక లాభాలను కోల్పోయే అవకాశం ఉంటుంది.
పెట్టుబడుల్లో భయం, అత్యాశ, అసహనం వంటి భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి. మార్కెట్ పడిపోయినప్పుడు భయం పెరుగుతుంది. మార్కెట్ వేగంగా పెరుగుతున్నప్పుడు అత్యాశ పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలనే ఆశ పెట్టుబడిదారులను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ భావోద్వేగాల కారణంగానే మార్కెట్ ఇచ్చే రాబడులకు, పెట్టుబడిదారులు నిజంగా పొందే రాబడులకు మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది.
విజయవంతమైన పెట్టుబడిదారులు మార్కెట్ను ప్రతిసారి ఖచ్చితంగా అంచనా వేసేవారు కాదు. మార్కెట్లో హెచ్చుతగ్గులు వచ్చినా ప్రశాంతంగా ఉండి, తమ దీర్ఘకాలిక ప్రణాళికను కొనసాగించేవారే ఎక్కువగా విజయం సాధిస్తారు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పడిపోతుంది అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ సరైన వ్యూహంతో, ఓర్పుతో పెట్టుబడుల్లో కొనసాగడం మాత్రం మన చేతుల్లో ఉంటుంది.
ప్రస్తుత కాలంలో సమాచారం కూడా పెట్టుబడిదారులపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు మార్కెట్ సమాచారం కోసం అప్పుడప్పుడు మాత్రమే చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లలోనే వార్తలు, సోషల్ మీడియా పోస్టులు, నిపుణుల అభిప్రాయాలు, మార్కెట్ అప్డేట్లు నిరంతరం వస్తున్నాయి. ఈ సమాచార ప్రవాహంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది.
సంపద సృష్టి అనేది సమాచారం లేకపోవడం వల్ల కంటే, భావోద్వేగ నిర్ణయాల వల్ల ఎక్కువగా దెబ్బతింటుంది. భయం, అత్యాశ, అతివిశ్వాసం వంటి భావనలు పెట్టుబడిదారులను తప్పు నిర్ణయాల వైపు నడిపించవచ్చు.
యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు, మహమ్మారులు, సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ మార్కెట్లు చివరకు కోలుకున్నాయి. అయితే ఆ పునరుద్ధరణ సమయంలో పెట్టుబడుల్లో కొనసాగిన వారికే ఎక్కువ ప్రయోజనం లభించింది. అందుకే.. పెట్టుబడుల్లో అసలైన ప్రమాదం మార్కెట్ కాదని, మార్కెట్ మార్పులకు మనం ఇచ్చే భావోద్వేగ స్పందనేనని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలతో, సహనంతో పెట్టుబడులు కొనసాగించడం సంపద సృష్టిలో కీలకమైన అంశం.
: గణేష్ మోహన్, మేనేజింగ్ డైరెక్టర్, బజాజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్.


