ఎడతెరిపిలేని వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. చేతికందే దశలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు కృష్ణమ్మకు వరద ముప్పు ముంచుకొచ్చింది.
సాక్షి, మచిలీపట్నం : ఎడతెరిపిలేని వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. చేతికందే దశలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు కృష్ణమ్మకు వరద ముప్పు ముంచుకొచ్చింది. భారీ వర్షాలకు జిల్లా కోలుకోలేని దెబ్బతినడంతో నష్టాలను అంచనా వేసే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించిన జిల్లా అధికారులు శనివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సహాయక చర్యలను వివరించారు. కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు 8 అడుగుల మేర ఎత్తి 3.15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇందకీలాద్రికి వాహనాల రాకపోకలు నాలుగోరోజూ నిలిపివేశారు.
రికార్డు స్థాయిలో వర్షం...
నందిగామ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. గత పదేళ్లలోని ఎప్పుడూలేని విధంగా ఏకంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం కూడా భారీ వర్షం పడింది. నల్లవాగు, పూచివాడు, రాళ్లవాగు, మురుగువాగులు పొంగుతున్నాయి. గండివాగు పొంగడంతో రహదారిపైకి వరదనీరు చేరి శుక్రవారం రాత్రి నందిగామ-మధిర మధ్య రాకపోకలు స్తంభించాయి. శనివారం కూడా వర్షాలు కురవడంతో రైతులు పత్తి, మొక్కజొన్న పంటలపై ఆశలు వదులుకున్నారు.
నందిగామ, చందర్లపాడు మండలాల్లో పలు డొంక రోడ్లు పూర్తిగా తెగిపోయాయి. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం ప్రాంతాల్లోనూ వరి చేలు ముంపు బారిన పడ్డాయి. గుడివాడ, కైకలూరు ప్రాంతాల్లో వరద నీరు గ్రామాలు, ఇళ్లలోకి చేరింది. కైకలూరు-ఏలూరు ప్రధాన రహదారి నుంచి పెనుమాకలంక-మణుగూరుకు వచ్చే రహదారికి పెద ఎడ్లగాడి వద్ద కొల్లేరుకు గండి పడింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నూజివీడు ప్రాంతంలో నాట్ల దశలోనే మొక్కజొన్నకు ఎదురుదెబ్బ తగిలింది.
తిరువూరు, మైలవరం ప్రాంతంలో పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. చేనేత మగ్గాలు పెట్టిన గుంతల్లోకి నీరు చేరి చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో పెడన నియోజకవర్గంలోని 8 గ్రామాల్లో 5,924 కుటుంబాల చేనేత కార్మికులు పనిలేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ ఇన్చార్జి జాయింట్ డెరైక్టర్ బాలూనాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడీఏ, ఏవోలు ఆయా మండలాల వారీగా నష్టాల అంచనాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
1.16 లక్షల ఎకరాలు మునక...
జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, జేసీ పి.ఉషాకుమారి, డీఆర్వో ఎల్.విజయ్చందర్ తదితర ముఖ్య అధికారులు జిల్లాలో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో 1,16,078 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులు నిర్ధారించారు. వాటిలో పత్తి 50,980, వరి 51,622, వేరుశనగ 21,125, మొక్కజొన్న 1,670, మినుము 200, కూరగాయలు 3,747, పసుపు 1500, మిర్చి 2,950, అరటి 650, తమలపాకు 280, బొప్పాయి 90 ఎకరాల్లో నీట మునిగినట్టు అంచనా వేశారు.
120 గ్రామాలపై ప్రభావం...
పది మండలాల్లో 120 గ్రామాలపై భారీ వర్ష ప్రభావం పడటంతో రెండు లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. మూడు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 71 ఇళ్లు పూర్తిగా, 149 పాక్షికంగా, గుడిసెలు 32, పశువుల పాకలు 2 దెబ్బతిన్నాయి. 1,078 నివాస గృహాల్లోకి నీరు చేరింది. 69 పశువులు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ రూ.2.39 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఏడు పునరావాస శిబిరాల్లో 811 మందిని తరలించారు. 650 మందికి ఆహార, నీటి ప్యాకెట్లు అందించి రెండు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
దెబ్బతిన్న రోడ్లు...
జిల్లాలో 499 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతినగా రూ.129 కోట్లు నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్ రోడ్లు 750 కిలోమీటర్ల మేర వంద రోడ్లు దెబ్బతిన్నాయి. నష్టం అంచనా వేయాల్సి ఉంది. పురపాలక సంఘాల్లో 800 కిలోమీటర్లు మేర పైపులైన్లు, డ్రెయిన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. 1,020 వీధిలైట్లు దెబ్బతిన్నాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఆరు పనులు దెబ్బతినగా రూ.3.50 లక్షలు నష్టం వాటిల్లింది. 25 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వానికి జిల్లా అధికారులు పంపిన నివేదికలో ప్రస్తావించారు.
రేపు సీఎం రాక
విజయవాడ సిటీ, న్యూస్లైన్ :రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో ఆయన పర్యటించేందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చి ఏరియల్ సర్వే చేస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు విమానాశ్రయంలో వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు.