సీఎం దిష్టిబొమ్మ దహనం | The burning of an effigy of CM | Sakshi
Sakshi News home page

సీఎం దిష్టిబొమ్మ దహనం

Aug 12 2013 2:30 AM | Updated on Sep 1 2017 9:47 PM

తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను పీడీఎస్‌యూ, పీవైఎల్ కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఖమ్మం బైపాస్ రోడ్డులో దహనం చేశారు.

 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను పీడీఎస్‌యూ, పీవైఎల్ కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఖమ్మం బైపాస్ రోడ్డులో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.రాజా, పీవైఎల్ ఖమ్మం డివిజన్ అధ్యక్షుడు ఎస్‌కె.లాల్‌మియా మాట్లాడుతూ.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, సీమాంధ్రులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ నుంచి అనుకూల ప్రకటన రాగానే... రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఆయా పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం తెలంగాణ విద్యార్థి, యువతపై ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో తమ ఆస్తులను, పెత్తనాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ, పీవైఎల్ నాయకులు ఎన్.చంటి, ప్రవీణ్, సాయిబాబా, సంజయ్, జగన్, కుమార్, వెంకటేష్, వాసు, చందు, నాగేశ్వరరావు, పాపారావు, బాబు తదితరులు పాల్గొన్నారు.
 
 బయ్యారంలో...
 బయ్యారం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆయన దిష్టిబొమ్మను న్యూడెమోక్రసీ కార్యకర్తలు, నాయకులు ఆదివారం బయ్యారంలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తుడుం వీరభద్రం, రామగిరి బిక్షం మాట్లాడుతూ.. సీమాంధ్ర నాయకులకు సీఎం వత్తాసు పలుకుతూ, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, తిరుమలేష్, కృష్ణ,అర్జున్,రమేష్ పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement