తమ్ముళ్లకు వెన్నుదన్ను | Takkuvenata their role in the call money | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు వెన్నుదన్ను

Dec 17 2015 12:49 AM | Updated on Aug 10 2018 8:16 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ ముసుగులో సెక్స్ రాకెట్ దందా నిర్వహిస్తున్న తెలుగు తమ్ముళ్లను కాపాడే చర్యలు మొదలయ్యాయి.

కాల్‌మనీలో  వారి పాత్ర తక్కువేనట!
సెక్స్ రాకెట్‌ను మరుగు పరిచే యత్నాలు
ఇప్పటివరకూ 30 మందిపై కేసుల నమోదు

 
గుంటూరు : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ  ముసుగులో సెక్స్ రాకెట్ దందా నిర్వహిస్తున్న తెలుగు తమ్ముళ్లను కాపాడే చర్యలు మొదలయ్యాయి.  ప్రభుత్వం.. దాడుల పేరిట ఇతర పార్టీలవారిపై పోలీసులను ఉసిగొల్పి హడావుడి చేస్తోంది. సెక్స్ రాకెట్‌లోని నిందితుల పాత్రపై మాత్రం పెదవి విప్పడం లేదు. దందాలో తమ్ముళ్ల పాత్రను కప్పిపుచ్చేందుకే కాల్‌మనీ పేరిట దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల ద్వారా  ఇతర పార్టీల నేతల పేర్లను వెల్లడిస్తూ సెక్స్ కుంభకోణాన్ని మరుగునపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే...
పటమట పంట కాల్వ రోడ్డులో తెలుగుదేశం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సమీప బంధువు యలమంచిలి రాము, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సన్నిహితుడు వెనిగళ్ల శ్రీకాంత్, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నందిగామలో పోటీకి యత్నించిన విద్యుత్‌శాఖ డీఈ ఎం.సత్యానందం, పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ ప్రముఖుడి సన్నిహితుడు పెండ్యాల శ్రీకాంత్, బాడీ బిల్డర్ భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు   కలిసి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అవసరం కోసం అప్పు తీసుకున్న వారిని బెదిరించి మహిళలను లొంగదీసుకోవడంతో పాటు వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. పైగా వారిని మరికొందరు మహిళలను తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ రాకెట్ నిర్వాహకులకు పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెట్టుబడులు పెట్టినట్టు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు.
 
ఇప్పుడేం జరుగుతోందంటే..
తమ టీడీపీ నేతల గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే భయంతో ప్రభుత్వం కాల్‌మనీ వ్యాపారం పేరిట దాడులకు పోలీసులను వినియోగించింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ ఇతర పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుంది. వారి నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకుంటూ కాల్‌మనీ వ్యాపారంలో తామే కాదు అన్ని పార్టీలు భాగస్వాములేననే అభిప్రాయం కలిగించే విధంగా చర్యలు చేపట్టింది. అయితే సెక్స్ రాకెట్ వ్యవహారంలో అసలు నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు మాత్రం చేపట్టలేదు.
 
వైఎస్సార్ సీపీ లక్ష్యంగా దాడులు :  కాల్‌మనీ వ్యాపారంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారని చెప్పడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ పార్టీ నేతలపై బాధితులు ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయక పోయినా, వారి ఇళ్లను అర్ధరాత్రి తనిఖీ చేసి ఆ కుటుంబాలను  భయభ్రాంతులకు గురిచేశారు. ఆ పార్టీలో కొనసాగితే ఇటువంటి వేధింపులు  ఉంటాయనే రీతిలో ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, అతని సోదరులకు కాల్‌మనీ వ్యాపారంతో సంబంధాలు లేవు. రియల్ ఎస్టేట్, మద్యం వంటి ఇతర వ్యాపారాల్లో వారు కొనసాగుతున్నారు. కావటిపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పెద్ద సంఖ్యలో పోలీసులు రాత్రి సమయంలో దాడి చేసి ఇంటిని సోదా చేశారు. ఇదే రీతిలో జిల్లాలో మొత్తం 30 మందిపై కేసులు నమోదు చేస్తే, ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే అధికంగా ఉన్నారు. మిగిలిన వారి వద్ద లభించిన డాక్యుమెంట్లలో రైతువారీ వడ్డీతో (రెండు రూపాయలు) రుణాలు ఇస్తున్న డాక్యుమెంట్లు లభించాయి. వారం రోజుల క్రితం కల్తీ మద్యం కేసు, ఆ తరువాత వెంటనే కాల్‌మనీ మాఫియా వెలుగులోకి రావడంతో టీడీపీ పాలన పట్ల ప్రజల్లో ఏహ్య భావం స్పష్టంగా కనపడుతోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement