హోదా కోసం ఆత్మహత్యాయత్నం

Suicide Attempt for AP Special Status - Sakshi

ఆగిరిపల్లి (నూజివీడు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఎన్‌టీఆర్‌ వీరాభిమాని బెజవాడ శ్రీనివాసరావు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బొద్దనపల్లి పంచాయతీ శివారు శోభనాపురం గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాసరావు (55) ఆగిరిపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు బుధవారం చేరుకుని ప్రత్యేకహోదా కోసం పురుగుల మందు సేవించాడు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆవేదన చెందుతూ తాను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన వెంట తెచ్చుకున్న లేఖలో పేర్కొన్నాడు.

గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్నస్వామి సాక్షిగా మాట ఇచ్చి మోసం చేశారని లేఖలో పేర్కొన్నాడు. హోదా విషయంలో వైఎస్సార్‌ సీపీ, జనసేన పార్టీలు సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం చెట్టు వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న శ్రీనివాసరావును తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, ఏఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావులు ప్రైవేటు ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top