పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి పట్టివేత
తిరుమల/తిరుపతి లీగల్ : తిరుమల శ్రీవారి హుండీలో గురువారం ఓ యువకుడు చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరా ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన రూ.13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన రఘు(20) శ్రీవారి దర్శనార్థం ఉచిత క్యూలైన్ ద్వారా గురువారం వేకువజామున 4 గంటలకు ఆలయంలోకి వెళ్లాడు. స్వామిని దర్శించుకుని హుండీ వద్దకు వచ్చాడు. హుండీలో కానుకలు సమర్పిస్తున్నట్టు నటించి చేతికందిన నగదు నోట్లను తీసుకుని జోబులో పెట్టుకున్నాడు. ఎవరూ చుడలేదన్నట్టు ముందుకు సాగాడు.
సీసీ కెమెరాల ద్వారా రఘు దొంగతనాన్ని విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే సమాచారాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చేరవేసారు. అతడిని అదుపులోకి తీసుకుని తిరుమల క్రైం పోలీసులకు అప్పగించారు. తిరుమల సీసీఎస్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.