శ్రీశైలానికి నాలుగుదిక్కుల్లో ఉన్న త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపూర్ దేవాలయాలను సందర్శించి మల్లన్నను దర్శించుకుంటే శ్రీగిరి ప్రదక్షిణ చేసినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీశైలం, న్యూస్లైన్: శ్రీశైలానికి నాలుగుదిక్కుల్లో ఉన్న త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపూర్ దేవాలయాలను సందర్శించి మల్లన్నను దర్శించుకుంటే శ్రీగిరి ప్రదక్షిణ చేసినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహిమాన్వితమైనదే శుక్రవారం శ్రీశైలంలో జరిగిన శ్రీగిరిప్రదక్షిణ. శ్రీశైలక్షేత్రానికి వలయకారంలో 6 కి.మీ రోడ్డుమార్గంగా నిర్మించిన బసవన్న మార్గ్ (రింగ్రోడ్డు) ద్వారా శ్రీగిరిప్రదక్షిణ చేస్తే నాలుగు ముఖద్వారాలను దర్శించుకున్నంత ఫలం దక్కుతుందని పీఠాధిపతులు, పండితులు చెబుతున్నారు.
శ్రీశైలమహాక్షేత్రంలో మొట్టమొదటిసారిగా ఈఓ చంద్రశేఖర ఆజాద్ శుక్రవారం దీనిని నిర్వహించారు. వందలాది మంది భక్తులు పంచాక్షరి నామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తుల ఓంకార నాదంతో శ్రీగిరిక్షేత్రం మారుమ్రోగింది. మార్గమధ్యలో పంచమఠాలు, మహిషాసురమర్ధిని, రుద్రాక్ష, భీమశంకర, ఘంటామఠాలు, మహారుద్రుని విగ్రహాల వద్ద ఆయా దేవతామూర్తులకు విశేషపూజలను చేశారు. యజ్ఞవాటిక, హేమారెడ్డి మల్లమ్మ మందిరాల వద్ద ప్రసాత వితరణ జరిగింది.
మహాఫలదాయకం
గిరిప్రదక్షిణను శివదీక్షను స్వీకరించిన శివస్వాములు చేసినట్లయితే మహాఫలదాయకమని పండితులు చెబుతున్నారు. జ్యోతిర్ముడి సమర్పించడానికి ముందు ఈ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా శుభఫలితాలను పొందుతారని, ప్రదక్షిణానంతరం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని జ్యోతిర్ముడిని సమర్పించడం ద్వారా వారు చేపట్టిన శివదీక్షకు పూర్తి ఫలం దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.