ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఉరకలెత్తే ఉత్సాహం

Special Response from Government Teachers to Online Skills Training - Sakshi

ఆన్‌లైన్‌ నైపుణ్య శిక్షణకు ప్రభుత్వ టీచర్ల నుంచి విశేష స్పందన 

వెబ్‌నార్‌ పోర్టల్‌ ద్వారా ఇంగ్లిష్‌ బోధన శిక్షణకు 1.10 లక్షల మంది హాజరు 

ఎస్సీఈఆర్టీ కార్యక్రమాలకు ఉపాధ్యాయుల మద్దతు 

విద్యార్థులు కూడా పాలుపంచుకునేలా ఏర్పాట్లు  

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు వీలుగా టీచర్లలో మరిన్ని నైపుణ్యాలను పెంపొందించేందకు ప్రభుత్వ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), సమగ్ర అభ్యసన అభివృద్ధి కార్యక్రమం (సీఎల్‌ఈపీ) పేరుతో చేపట్టిన వెబ్‌నార్‌ శిక్షణకు ప్రభుత్వ టీచర్ల నుంచి ఆనూహ్య స్పందన లభిస్తోంది. వెబ్‌నార్‌ పోర్టల్‌ ద్వారా  ఆన్‌లైన్‌లో అందించే ఆంగ్లం, తదితర టీచింగ్‌ శిక్షణకు 1.10 లక్షల మంది హాజరయ్యారు. వీరికి ఎస్సీఈఆర్టీ రెండు విధాలుగా శిక్షణనిస్తోంది. రీడింగ్‌ మెటీరియల్, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌లను ‘అభ్యసన’ యాప్‌లో నిర్వహిస్తున్నారు.వెబ్‌నార్‌ పోర్టల్‌లో లైవ్‌ తరగతులను వివిధ విశ్వవిద్యాలయాలు, ఇతర జాతీయ సంస్థల విద్యావేత్తలతో నిర్వహిస్తున్నారు. 

సాంకేతిక, సబ్జెక్ట్‌ అంశాలపై శిక్షణ 
వెబ్‌నార్‌ పోర్టల్‌  ద్వారా తొలుత టీచర్లకు టెక్నాలజీ అంశాలపైనా బోధన సాగింది. పోర్టల్‌ వినియోగం, ఎలాంటి కంటెంట్‌ను ఎలా తీసుకోవాలి? యూ ట్యూబ్‌లో ఏయే అంశాలను గ్రహించాలి వంటి అంశాల్లో సాంకేతిక నైపుణ్యాలను అందించారు. తరువాత ఆంగ్ల నైపుణ్యాలు, వివిధ సబ్జెక్టుల బోధనా విధానాలపై 15 రోజులు శిక్షణనిచ్చారు. ఇంగ్లిష్‌  గ్రామర్‌తో పాటు వివిధ సబ్జెక్ట్‌ల కంటెంట్‌ కూడా ఉంది. ప్రస్తుతం స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ  చేపడుతున్నాం. విద్యార్థులకు దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా పాఠ్యాంశాలు చెప్పించాం. టీచర్లే స్వయంగా ఆయా పాఠ్యాంశాలపై వీడియోలు చిత్రీకరించేలా వీడియో ఎడిటింగ్, ఫొటో ఎడిటింగ్‌ అంశాలపై లండన్‌కు చెందిన నిపుణురాలు ఎడ్విన్‌తో ఆ టెక్నాలజీపై శిక్షణ ఇప్పించాం. దీంతో టీచర్లు పలు అంశాలపై 800 వీడియోలు రూపొందించారు.     
– డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ 

ఆన్‌లైన్‌లో అభిప్రాయాల సేకరణ
► వెబ్‌నార్‌ శిక్షణ ద్వారా వారు ఆంగ్ల  నైపుణ్యాలు పెంపుదల, ప్రయోజనం, సమస్యలు అవసరమైన మార్పులపై టీచర్ల నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో అభిప్రాయాలను తీసుకున్నారు.  
► 5 పాయింట్ల రేటింగ్‌ ఉండే ప్రతి అంశానికి దాదాపు అందరు టీచర్లు కూడా 4.5 నుంచి 5 పాయింట్ల రేటింగ్‌ ఇచ్చారు. ఈ శిక్షణ నిరంతరం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.  
► టీచర్లు, విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులను కూడా ప్రారంభించారు.  
► శిక్షణ సందర్భంగా రోజువారీ టెస్ట్‌లు, గ్రాండ్‌ టెస్ట్‌ల పేరుతో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌లను నిర్వహిస్తున్నారు.  
​​​​​​​► వెబ్‌నార్‌ శిక్షణలో 80 వేల మంది టీచర్లు గ్రాండ్‌ టెస్ట్‌కు హాజరయ్యారు.  
​​​​​​​► టీచర్లు ఎప్పుడు పాల్గొన్నా ఇబ్బంది లేకుండా అంతకు ముందు అంశాల రికార్డులను చూసి నేర్చుకొనేలా చేశారు. 

ఎంతో ప్రయోజనం  
లాక్‌డౌన్‌ సమయంలోప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం మొబైల్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌నార్‌ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే వీలు కల్పించడంతో ఎంతో మేలు జరుగుతోంది. మే 27 నుంచి ప్రారంభమైన స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ జూన్‌ 30 వరకూ కొనసాగనుంది. ఈ వెబ్‌నార్‌ శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించాను. 2012 నుండి 1 నుండి 5 తరగతుల వరకు ఉన్న పాఠాలను వీడియో పాఠాలుగా తయారుచేసి సుమారు 800 వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాను.    

6 లక్షల మందికి చేరువగా ఆన్‌లైన్‌ క్లాసులు 
లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులకు నిరంతరాయ విద్యా బోధన దిశగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులకు విశేష ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్, రేడియా, జూమ్‌ యాప్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఈ క్లాసులు ఆరు లక్షల మంది విద్యార్థులకు చేరుకునే దిశగా నడుస్తున్నాయి. ఇప్పటికే లక్షమందికి పైగా ఆన్‌లైన్‌ క్లాసులు అందుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడటంతో మరింత ప్రాధాన్యం పెరిగింది,  ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కూడా ఆలస్యం కానున్నందున సకాలంలో సిలబస్‌ పూర్తి చేసేలా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కల్నల్‌ వి రాములు తెలిపారు. 

► విద్యామృతం పేరుతో ఈ పథకం ప్రారంభించి డీడీ–సప్తగిరి ఛానల్‌ ద్వారా క్లాసులు.  
► ఈ–విద్యాలోక టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్‌ బోధన. నిష్ణాతులైన గురుకుల ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో తరగతులు.  
► ఎంసెట్‌ విద్యార్థులకు ఆలిండియా రేడియో ద్వారా క్లాసులు.  
► 409 మంది నూతన టీజీటీలకు జూమ్‌ యాప్‌ ద్వారా శిక్షణ తరగతులు.  
► కొత్తగా పదోన్నతి పొందిన గురుకుల ప్రిన్సిపాల్స్‌కు ‘లీడర్‌షిప్‌ ఇంపరేటివ్స్‌’పై శిక్షణ. 
► లిటిల్‌ టీచర్స్‌ పేరుతో 39 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు.  
► గురుకుల విద్యాలయాల సొసైటీ సిబ్బందికి ఇంగ్లిష్‌ గ్రామర్, ఈ–ఆఫీస్‌ రికార్డు వర్కులపై శిక్షణ.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top