శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు.. హైదరాబాద్ కు తరలింపు | Shobha nagireddy injured in road accident in Kurnool district | Sakshi
Sakshi News home page

శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు.. హైదరాబాద్ కు తరలింపు

Apr 24 2014 7:14 AM | Updated on Aug 30 2018 3:58 PM

శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు.. హైదరాబాద్ కు తరలింపు - Sakshi

శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు.. హైదరాబాద్ కు తరలింపు

వైఎస్సార్‌సీపీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం
నంద్యాలలో ప్రాథమిక చికిత్స.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు


సాక్షి, ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): వైఎస్సార్‌సీపీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శోభా నాగిరెడ్డి బుధవారం వైఎస్ షర్మిలతో పాటు నంద్యాలలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో పాల్గొన్న అనంతరం ఆళ్లగడ్డలోని తమ నివాసానికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం సంభవించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేయడంతో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి నాలుగు పల్టీలు కొట్టింది.

డోర్ ఓపెన్ కావడంతో ముందు సీట్లో కూర్చున్న శోభా నాగిరెడ్డి వాహనం నుంచి ఎగిరి మళ్లీ వాహనంపై పడ్డారు. దీంతో ఆమె తలకు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన నంద్యాలలోని సురక్ష ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే, ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని, అందుకు తప్పనిసరిగా హైదరాబాద్ తరలించాల్సిందేనని అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి. దాంతో ఆమెను బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలియగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నంద్యాల ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో ఆమెతోపాటు కారు డ్రైవర్ నాగేంద్ర, గన్మెన్ శ్రీనివాస్, బాషాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

శోభానాగిరెడ్డికి పక్కటెముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటిలేటర్ ద్వారా ఆమెకు శ్వాస అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం శోభా నాగిరెడ్డిని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement