అగ్రనేత అరుణ ఎక్కడ? | Searching For Maoist Aruna In Visakhapatnam District | Sakshi
Sakshi News home page

అగ్రనేత అరుణ ఎక్కడ?

Sep 26 2019 9:31 AM | Updated on Sep 26 2019 9:49 AM

Searching For Maoist Aruna In Visakhapatnam District - Sakshi

సాక్షి, సీలేరు (పాడేరు): ఏవోబీలోని మహిళా మావోయిస్టుల విభాగంలో అరుణ పేరు తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు అరుణ ఎవరు, ఉద్యమంలో ఆమె బాధ్యత ఏమిటీ, అరుణ కోసం ఏడాదిగా పోలీసు బలగాలు ఎందుకు గాలింపు చేపడుతున్నాయి అన్న ప్రశ్నలు ఏవోబీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్‌కౌంటర్‌లో ఆమె ఉందని ప్రచారం కూడా సాగింది. అయితే ఎదురుకాల్పుల్లో ఆమె లేకపోవడంతో పోలీసు బలగాలు అరుణకోసం జల్లెడపడుతున్నాయి. పెందుర్తి మండలం సుజాతనగర్‌కు చెందిన అరుణ, ఆమె కుటుంబం కూడా మావోయిస్టుల ఉద్యమం నుంచి ఉన్నారు. అరుణ చిన్న వయసులోనే ఉద్యమానికి ఆకర్షితురాలైంది.

ఏడాది క్రితం గూడెం మండలం మర్రిపాకల ఎన్‌కౌంటర్లో మృతి చెందిన అగ్రనేత ఆజాద్‌ సొంత చెల్లెలు ఈమె. అరుణ ఫొటో రాంగుడ ఎన్‌కౌంటర్లో లభ్యమైన ల్యాబ్‌ట్యాప్‌లో కనిపించింది. ఆమె పేరు తప్ప ఆమె ఎలా ఉంటుందనేది అప్పుడే వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్‌ చీఫ్‌ అయిన చలపతి భార్య అరుణ. ప్రస్తుతం అరుణ పార్టీలో కీలక పదవిలో ఉంది. చలపతి భార్య కావడం, తూర్పు మల్కన్‌గిరి డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం ఏకే47 తుపాకీ వాడుతున్నట్లు మాజీ మావోయిస్టుల ద్వారా తెలిసింది. అలాగే ఆమెకు ఆరుగురు అంగరక్షకులు కూడా ఉన్నట్లు సమాచారం. 

కిడారి, సోమ హత్యల ఘటన నుంచి..
రాంగుడ ఎదురుకాల్పుల నుంచి అరుణ బయట ప్రపంచానికి తెలిసింది. అక్కడి నుంచి అందరి మావోయిస్టుల్లాగే పోలీసులు చూసే వారు. కానీ ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన  మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. అప్పటి నుంచి ఏవోబీ, విశాఖ, తూర్పుగోదావరి పోలీసులు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలన్న లక్ష్యంతో గాలిస్తున్నారు.

ఆమె ఆచూకీ కోసం ఏడాదిగా..
మాజీ ఎమ్మెల్యేల హత్య సంఘటనల నుంచి అరుణ  కోసం బలగాలు అడవిలో తిరగని రోజు లేదు. ఎప్పుడు దొరుకుతుందా అని తుపాకీలు ఎక్కుపెట్టి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జీకేవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టుల్లో తొలుత ఆమె ఉందని ప్రచారం జరిగింది. ఆమె లేకపోవడాన్ని గుర్తించిన పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. గాలికొండ ఏరియా కార్యదర్శి హరి గూడెం మండలం గునుకురాయి ప్రాంతానికి చెందిన వాడు. అయితే ఇటీవల అరుణ ఆడియో టేపు రిలీజ్‌ చేసినపుడు అగ్రనేత నవీన్‌తో పాటు హరి కూడా లొంగిపోయాడని, తిరిగి ఉద్యమంలోకి ఎలా వచ్చాడని  చెప్పింది. కానీ మొన్న జరిగిన ఎదురుకాల్పుల్లో హరి కూడా ఉన్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం హరి పార్టీలో ఉన్నాడా?.. బయట ఉన్నాడా? అనేది ప్రశ్నగానే మిగిలింది.

పత్రికలకు అబద్ధం చెప్పను
ప్రస్తుతం జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. దీనిపై చింతపల్లి ఏఎస్పీ సతీష్‌ కుమార్‌ను వివరణ కోరగా ప్రతికలకు అవాస్తవాలు చెప్పడం లేదని, అరుణ మా దగ్గర లేదని, ఎదురుకాల్పుల్లో 15 మంది ఉన్నారని, వీరిలో ఐదుగురు చనిపోయారని మిగిలిన వారు తప్పించుకున్నారన్నారు. అందులో అరుణ ఉందో లేదో బలగాలు కూడా చూడలేదని వివరణ ఇచ్చారు. తమకు ఎవరైనా దొరికితే అప్పుడు అరుణ ఉందో లేదో తెలుస్తుందన్నారు. ఆరోపణల్లో వాస్తవం లేదని ఏఎస్పీ చెప్పారు.
– సతీష్‌కుమార్, చింతపల్లి ఏఎస్పీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement