ఆదోని శివారులోని సాదాపురం గ్రామ సమీపంలో మంగళవారం కనిపించిన దృశ్యాలు క్రైం సినిమాను తలపించాయి.
ఆదోని శివారులోని సాదాపురం గ్రామ సమీపంలో మంగళవారం కనిపించిన దృశ్యాలు క్రైం సినిమాను తలపించాయి. వందలాది జనం.. పదుల సంఖ్యలో పోలీసులు.. అధికారులూ జతకలిశారు. సంకెళ్లు వేసిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తుండగా.. ఏమి జరిగిందో తెలియని ఉత్కంఠ. చుట్టూ ముళ్ల కంపలు.. మధ్యలో ఎండిపోయిన వాగు.. అందరూ గుమికూడారు. ఆ ప్రాంతంలో తవ్వగా వ్యక్తి మృతదేహం బయటపడింది. అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. అక్క మొగుడు(బావ) మోజులో భర్తను భార్యే హత్య చేయించిన ఉదంతం బాధిత కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. పెళ్లికి ముందు కలిగి ఉన్న వివాహేతర సంబంధంతోనే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు
విచారణలో వెల్లడైంది.
ఆదోని టౌన్, న్యూస్లైన్: ఆస్పరికి చెందిన మునిరాజు(23) ఈనెల 9వ తేదీన అదృశ్యం కాగా.. 19 రోజుల తర్వాత శవమై కనిపించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు మిస్టరీని ఛేదించారు. మునిరాజుకు మూడేళ్ల క్రితం పత్తికొండకు చెందిన భారతితో వివాహమైంది. ఆ తర్వాత ఏడాదికే వీరు స్థానికంగానే వేరు కాపురం పెట్టి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. భారతి అక్క తిరుపతమ్మ ఆస్పరి సమీపంలోని మొలగవళ్లిలో ఉంటోంది. ఈమె భర్త వేమన్న ఆటో డ్రైవర్. అతనితో భారతికి పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉంది. దీంతో అప్పుడప్పుడు ఆస్పరిలోని మరదలు ఇంటికి వచ్చివెళ్లేవాడు. చివరకు వీరిద్దరూ మునిరాజును వదిలించుకునేందుకు నిర్ణయించుకున్నారు.
జీవనోపాధికి కొద్ది రోజుల క్రితం మునిరాజు భార్యతో కలసి గుంటూరు వెళ్లాడు. ఇటీవల తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో వేమన్న, భారతి కలసి మునిరాజు హత్యకు కుట్ర పన్నారు. ఆటో ఫైనాన్స్ కంపెనీకి రూ. 10 వేలు కంతు కట్టాలని మునిరాజును అప్పు ఇవ్వాలని వేమన్న కోరాడు. ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో ఈనెల 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరూ కలసి డబ్బు కట్టేందుకు ఆటోలో ఆదోనికి బయలుదేరారు. అప్పటికే ఆటోలో మద్యం, బిర్యానీ సిద్ధంగా ఉంచడంతో మద్యం సేవించేందుకు మార్గమధ్యంలో సాదాపురం బస్టాప్ చేరువలోని ఏడు మోరీల వాగు వద్దకు వెళ్లారు.
ఈ సమయంలో మునిరాజుకు మద్యాన్ని అధికంగా తాపి, వేమన్న ఎక్కువగా తాగినట్లు నటించా డు. ఆ తర్వాత మునిరాజును వాగు గట్టుపై నుంచి కిందకు తోసేయడంతో మృతి చెందాడు. అక్కడి నుంచి వేమన్న ఇంటికి చేరుకుని గడ్డపార, సలికె తీసుకుని హత్య చేసిన ప్రాంతానికి తిరిగి వెళ్లాడు. వాగు మధ్యలోనే గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చి పైన బండ రాళ్లు వేసి ఏమి తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు.
మలుపులు తిరిగిన విచారణ: 9వ తేదీ రాత్రి పొద్దుపోయినా మునిరాజు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, అన్న హనుమన్న స్నేహితులను విచారించినా ఫలితం లేకపోయింది. 11వ తేదీ ఆస్పరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే భారతితో వేమన్నకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసలు వారిని అనుమానించారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న వేమన్న కేసు నుంచి తప్పించుకునేందుకు ఈనెల 21వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నటించి చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. 24వ తేదీన డిశ్చార్జ్ అయిన వేమన్నను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. అయితే విచారణలో తనకేమీ తెలియదని చెప్పాడు. దీంతో వేమన్నను పోలీసులు ఇంటికి పంపారు. చివరకు భారతి, వేమన్న సెల్ఫోన్ల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.
విచారణ చివరి దశకు వస్తున్న సమయంలో వేమన్న సోమవారం ఆస్పరి వీఆర్ఓ సుధాకర్ ఎదుట లొంగిపోయి మునిరాజును హత్య చేసినట్లు అంగీకరించాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలానికి తీసుకెళ్లారు. ఆదోని తహశీల్దార్ అన్వర్ హుసేన్, ఫోరెన్సిక్ నిపుణులు ప్రభాకర్ సమక్షంలో తానే హత్యచేసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించడంతో తహశీల్దార్ రికార్డు చేశారు. అనంతరం శవానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఆలూరు సీఐ శంకర్, ఆస్పరి ఎస్ఐ లక్ష్మీ నారాయణ తెలిపారు.
మునిరాజు హత్యకేసులో వేమన్న ఒక్కడే చేశాడా, ఇతరులు ఎవరైనా సాయం చేశా రా అనే కోణాల్లో కేసు విచారిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఐదు నెలల క్రితం భారతి గుంతకల్లు ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిందని, అయితే మునిరాజు పోలికలతో నల్లగా ఉండటంతో భారతి, వేమన్న శిశువు గొంతునులిమి చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారని తెలి పారు. హత్య కేసు విచారణ చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, ప్రజలు పెద్ద ఎత్తున సాదాపురం చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి తల్లి సుంకమ్మ రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. భారతిని పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.