
ఆ సంచులకు రూ.15 కోట్లు
సంచుల పేరుతో పౌరసరఫరాల శాఖలో దోపిడీకి తెర లేచింది.
‘చంద్రన్న కానుక’ పంపిణీ కోసం భారీగా ఆర్డర్
* ఇంత తక్కువ గడువులో అందించలేమంటున్న తయారీదారు
సాక్షి, హైదరాబాద్: సంచుల పేరుతో పౌరసరఫరాల శాఖలో దోపిడీకి తెర లేచింది. సంక్రాంతి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న కానుక కింద సరుకులు అందచేసే సంచులకు రూ.15 కోట్ల వ్యయం కానుంది. పండుగ సందర్భంగా ఆరు రకాల సరుకులను ఒక సంచిలో ఉంచి ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్ పేరిట లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించటం తెలిసిందే.
తెల్ల రేషన్ కార్డులు, అంత్యోదయ, అన్నయోజన, అన్నపూర్ణ కార్డులున్న ప్రతి లబ్ధిదారుడికి అర కిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, కిలో శనగలు, అర కిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యిని చంద్రన్న కానుక కింద అందచేయనున్నారు. ఒక్కో సంచి రూ. 11.60 చొప్పున 1.30 కోట్ల సంచుల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఈ లెక్కన సంచుల కోసమే రూ. 15 కోట్ల 80 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఈ నెల 12వ తేదీలోగా లబ్ధిదారులకు సరుకులు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు, మంత్రి మధ్యన సఖ్యత లేకపోవడంతో సంచుల తయారీ కోసం ఆలస్యంగా ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా గడువులోగా కోట్ల సంఖ్యలో సంచులు సరఫరా చేయలేమని ఆర్డర్ తీసుకున్న సంస్థ బుధవారం సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఇబ్బందికర స్థితి ఎదురైందని తెలుస్తోంది.